యోగీకి లవ్ జిహాద్ షాక్- విద్వేష ఆర్డినెన్స్ రద్దు కోరుతూ 104 మంది మాజీ ఐఏఎస్ల లేఖ
యూపీలో బలవంతపు మతమార్పిళ్లకు వ్యతిరేకంగా యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కలకలం రేపుతోంది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ ఆర్డినెన్స్ కింద దాదాపు 20 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 60 మంది వరకూ పోలీసులు అరెస్టులు చేశారు. దీంతో ఈ ఆర్డినెన్స్పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
యోగీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద మాతమార్పిళ్ల వ్యతిరేక ఆర్డినెన్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విద్వేష రాజకీయాలకు కేంద్రంగా మార్చిందని ఆరోపిస్తూ 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు సీఎం యోగికి తాజాగా లేఖ రాశారు. ఈ లేఖ రాసిన వారిలో మాజీ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగశాఖ కార్యదర్శి నిరుపమారావు, మాజీ ప్రధానమంత్రి సలహాదారు టీకేఏ నాయర్ వంటి వారు ఉన్నారు.
సీఎం యోగీతో పాటు ఈ ఆర్డినెన్స్కు మద్దతిస్తున్న ఇతర రాజకీయ నేతలంతా మీరు ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని మరోసారి చదువుకోవాలని మాజీ ఐఏఎస్ ప్రముఖులు సూచించారు. ఒకప్పుడు గంగా-జమునా నాగరికతకు చిహ్నంగా ఉన్న యూపీ ప్రస్తుతం విద్వేషం, విభజన, మూర్ఖ రాజకీయాలకు కేంద్రంగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాలనా సంస్ధలు మతపరమైన విషంలో మునిగిపోయాయని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్న యూపీ యువతపై మీ పాలనా యంత్రాంగం దారుణంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. యూపీలో గత నెల రోజుల్లో చోటు చేసుకున్న పలు ఘటనలను వారు తమ లేఖలో ప్రస్తావించారు.