రాజకీయ విద్వేష కేంద్రంగా యూపీ: యోగి ఆదిత్యనాత్కు 104 మంది మాజీ ఐఏఎస్ అధికారుల లేఖ
లక్నో: ప్రేమ, పెళ్లి పేరుతో జరుగుతున్న బలవంతపు మతమార్పిడులను అడ్డుకట్ట వేసేందుకు ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇటీవల ఓ చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చట్టం కింద పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే, ఈ చట్టం ప్రతిపక్షాలతోపాటు ఇతర వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
తాజాగా, 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు యూపీ సర్కారుకు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఓ లేఖను రాశారు. విద్వేషపూరిత రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ కేంద్రంగా మారిందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై సంతకం చేసిన 104 మంది మాజీ ఐఏఎస్ అధికారుల్లో మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శివశంకర్ మీనన్, మాజీ ఫారెన్ సెక్రటరీ నిరుపమా రావు, ప్రధాని మాజీ అడ్వైజర్ టీకేఏ నాయర్ ఉన్నారు.
ఆ వివాదాస్పద చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మాజీ ఐఏఎస్ అధికారులు డిమాండ్ చేశారు. రాజ్యాంగం గురించి తెలుసుకోవాలన్నారు. విద్వేషపూరిత రాజకీయాలకు యూపీని కేంద్రంగా మార్చొద్దని, ప్రజల్లో సామాజిక విషాన్ని నింపవద్దని సూచించారు. గంగా-జమునా సంస్కృతిని గుర్తు చేసుకోవాలన్నారు.
స్వేచ్ఛ జీవిస్తున్న యువతరంపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మైనార్టీలపై దాడులు పెరిగిపోయానని ఆరోపించారు. హిందు యువతులను బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారనే నెపంతో దాడులు చేయడం సరికాదని అన్నారు. యువతకు తమకు నచ్చినవారిని వివాహం చేసుకునే స్వేచ్ఛ ఉందని తెలిపారు.
కొందరిపై ఆధారాలు లేకుండానే లవ్ జిహాద్ కేసులు పెడుతున్నారని లేఖలో మాజీ ఐఏఎస్ అధికారులు ఆరోపించారు. వివాహాల పేరుతో మతం మారుస్తున్నారంటూ ఇలాంటి కేసులు పెట్టి వేధించడం సరికాదని అన్నారు. కోర్టులు కూడా నచ్చినవారిని వివాహం చేసుకునే హక్కును రాజ్యాంగం ద్వారా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.