షాకింగ్ : ఆలు మెంతి కూర... కానీ అసలు సంగతి వేరే... ఆస్పత్రిలో కుటుంబం
ఉత్తరప్రదేశ్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. మెంతి కూర అనుకుని గంజాయి ఆకులతో వంట చేసుకుని తిన్న ఓ కుటుంబం తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దీనిపై రెండు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
ఒక కథనం ప్రకారం... మియాగంజ్ గ్రామానికి చెందిన నావల్ కిశోర్ అనే వ్యక్తి కూరగాయలు అమ్ముతుంటాడు. శనివారం(జూన్ 27) అతని షాపు వద్దకు వెళ్లిన నితేశ్ అనే యువకుడు.. మెంతి కూర కావాలని అడిగాడు. అయితే కిశోర్ మెంతికి బదులు గంజాయి ఆకులు ఇచ్చాడు. అవి మెంతి ఆకులే అనుకున్న నితేశ్.. ఇంటికెళ్లి వాటిని వదిన పింకీకి ఇచ్చాడు. ఆమె ఆ ఆకులతో ఆలు మెంతి కూర చేసింది. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అందరూ అస్వస్థతకు గురయ్యారు.
మరో కథనం ప్రకారం... నావల్ కిశోర్ నితేశ్కి గంజాయి ప్యాకెట్ ఇచ్చి మెంతి ఆకులు అని అబద్దం చెప్పాడు. నిజానికి నితేశ్ను ఆట పట్టిద్దామని అతను జోక్ చేశాడు. కానీ నితేశ్ అవి నిజంగానే మెంతి ఆకులు అనుకుని... ఇంటికి తీసుకెళ్లి వంట చేయమని ఇచ్చాడు. ఇంట్లో వాళ్లు కూడా దాన్ని పెద్దగా పరిశీలంచకుండానే మెంతి ఆకులే అనుకుని వంట చేశారు. కానీ తిన్న తర్వాత అందరూ అస్వస్థతకు గురయ్యారు.
చుట్టుపక్కల వారిని సాయం చేయమని కోరగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికికి చేరుకున్న పోలీసులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... అక్కడ వండని ఆకులను కొన్నింటిని గుర్తించారు. వాటిని గంజాయి ఆకులుగా నిర్దారించారు. ఆ ఆకులను నితేశ్కి ఇచ్చిన కిశోర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.