ఆసక్తికర తీర్పు ...భర్తకు భరణం చెల్లించాలని భార్యకు కోర్టు ఆదేశం
ఎక్కడైనా భార్యాభర్తలు విడిపోతే భార్యకు భర్త భరణం ఇవ్వడం సాధారణంగా చూస్తుంటాం. భర్తకు భార్య భరణం ఇచ్చే పరిస్థితులు దాదాపుగా విని ఉండకపోవచ్చు. కానీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ ఫ్యామిలీ కోర్టు ఒక కేసులో భార్య భర్తకు భరణం ఇవ్వాలని ఆసక్తికర తీర్పునిచ్చింది.
ఎటువంటి ఆదాయం లేని భర్తకు, పెన్షన్ పొందుతున్న భార్య భరణం చెల్లించాలంటూ ఉత్తరప్రదేశ్లోని ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. ముజఫర్ నగర్ లోని ఖతౌలీ పట్టణానికి చెందిన 62 ఏళ్ల కిషోర్ లాల్ సోహంకర్ టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య మున్నీదేవి అతని నుండి విడాకులు తీసుకుంది. మున్ని దేవి ఆర్మీలో పని చేసేవారు. తాజాగా ఆమె కూడా ఆర్మీ నుండి పదవీ విరమణ పొందారు. దీంతో ప్రస్తుతం ఆమెకు నెలకు 12 వేల రూపాయల పెన్షన్ వస్తుంది.
అయితే ఒంటరిగా జీవనం సాగిస్తున్న సోహంకర్ తన భార్య తనతో ఉండేలా, తన ఇంటికి వచ్చేలా చూడాలని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు.ఈ కేసును విచారిస్తున్న కోర్టుకు మున్నిదేవి సోహంకర్ తో ఉండడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో సోహంకర్ తన భార్య నుండి నిర్వహణా భత్యం కోరుతూ 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం మరోమారు పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో కోర్టు మున్నీదేవికి భర్తకు భరణం చెల్లించాలని ఆదేశించింది .ఎలాంటి ఆదాయ వనరులు లేని భర్తకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున భరణం చెల్లించాలని ఆదేశించింది. ఆమెకు నెలకు 12 వేల రూపాయల పెన్షన్ వస్తున్న నేపథ్యంలో భర్తకు భరణం ఇవ్వాలని కోర్టు పేర్కొంది.