భార్యను హతమార్చిన మాజీ క్రికెటర్: ప్రెషర్ కుక్కర్ మూతతో తలపై బాది..!
బెంగళూరు: బెంగళూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్ ఒకరు తన భార్యను దారుణంగా హత్య చేశారు. భార్యను హతమార్చడానికి ప్రెషర్ కుక్కర్ మూతను ఉపయోగించాడు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. పోస్ట్ మార్టమ్ నివేదిక అతని బండారాన్ని బట్టబయలు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్యకేసు నమోదు చేశారు.
బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కిరాతకుడి పేరు రాకేష్ కుమార్ గుప్తా. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వాడు. ఉత్తర్ ప్రదేశ్ తరఫున రాష్ట్రస్థాయి క్రికెట్ జట్టులో ఆడాడు. 2016లో క్రికెటర్ గా ఉన్నప్పుడే సొంత రాష్ట్రానికే చెందిన రాధ అనే యువతితో వివాహమైంది. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తరువాత మెడికల్ రెప్రజెంటేటివ్ గా బెంగళూరులో స్థిరపడ్డాడు. భార్యతో కలిసి మహాలక్ష్మి లేఅవుట్ లో నివసిస్తున్నాడు.
అయిదు రోజుల కిందట రక్తమోడుతున్న తలతో తన భార్య రాధను ఆసుపత్రిలో చేర్పించాడు. మెట్ల మీది నుంచి కాలు జారి కిందికి పడిందని, ఫలితంగా తలకు తీవ్రంగా గాయమైందని డాక్టర్లకు తెలిపాడు. ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే ఆమె మరణించారు. రాధ తలకు తగిలిన గాయాన్ని పరిశీలించిన డాక్టర్లలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మెట్ల మీది నుంచి జారిపడటం వల్ల కలిగిన గాయం కాదని నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని వారు మహాలక్ష్మి లేఅవుట్ పోలీసులకు తెలియజేశారు.
సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు రాధ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. ఆదివారం ఉదయం పోస్ట్ మార్టమ్ నివేదిక పోలీసుల చేతికి అందింది. అంతే.. రాకేష్ కుమార్ గుప్తా బండారాన్ని బయట పెట్టిందా పోస్ట్ మార్టమ్ నివేదిక. బలమైన వస్తువుతో పదే పదే తలపై కొట్టడం వల్ల రాధ గాయపడ్డారని తేలింది. దీనితో పోలీసులు రాకేష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.
అదే సమయంలో రాధ తండ్రి రామ్ బహదూర్ కూడా అల్లుడి మీదే అనుమానాలు వ్యక్తం చేశారు. తమ కుమార్తెను రాకేష్ కుమారే హత్య చేసి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమదైన శైలిలో ప్రశ్నించగా.. రాకేష్ కుమార్ నిజాన్ని వెల్లడించాడు. కుక్కర్ మూతతో పదే పదే కొట్టానని అంగీకరించాడు. కుక్కర్ మూతకు ఉండే నాజిల్ తో బలంగా కొట్టానని చెప్పాడు. అదనపు కట్నాన్ని తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే రాకేష్ కుమార్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని రామ్ బహదూర్ ఆరోపిస్తున్నారు.