ఘోరం: 3 ఏళ్ల బాలిక నోట్లో సుతిలి బాంబు పెట్టి పేల్చాడు, 50 కుట్లు పడ్డాయి
మీరట్: దీపావళి వేడుకల్లో ఓ ఆకతాయి అత్యుత్సాహం ప్రదర్శించి ఓ మూడేళ్ల బాలిక నోట్లో బాంబు పెట్టి కాల్చాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. ఈ సంఘటన దీపావళికి ముందు రోజు జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం మిలాక్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. బాలిక తండ్రి శశికుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. బాలిక నోట్లో బాంబు పెట్టి గాయానికి కారణమైన వ్యక్తిని హర్పాల్గా గుర్తించారు.
తన కూతురు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో హర్పాల్ వచ్చాడని, తన మూడేళ్ల కూతురు నోట్లో సుతిలి బాంబు పెట్టి, కాల్చాడని ఆ బాలిక తండ్రి చెప్పారు. బాంబు పేలి తన కూతురుకు తీవ్ర గాయమైందని చెప్పారు. ఆమెకు దాదాపు 50 కుట్లు పడ్డాయని తెలిపారు. ఆమె గొంతు కూడా ఇన్ఫెక్షన్కు గురయిందని చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.