రేప్కు సహకరించలేదని బాలిక సజీవ దహనం
ఔరంగాబాద్: అత్యాచారం చేస్తున్న సమయంలో ప్రతిఘటించినందుకు 17 ఏళ్ల బాలికపై కిరోసిన్ పోసి నిప్పింటించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఔరంగాబాద్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చనిపోయిన బాలిక ఔరంగాబాద్ గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుంది.
బాలిక తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో అదే గ్రామానికి భోలా అనే యువకుడు ఇంట్లోకి చొచ్చుకెళ్లి బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బాలిక ప్రతిఘటించడంతో కిరోసిస్ పోసి నిప్పంటించాడు. దీంతో బాలిక పెద్దగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు.
దీనిని గమనించిన బాలిక బాబాయి వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా, అప్పటికే బాలిక శరీరం పూర్తిగా కాలిపోయి చనిపోయింది. బాధితురాలు సమీపంలోని కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. జరిగిన ఘోరంపై బాధితురాలి బాబాయి సమీపంలోని సర్దార్ బజార్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.
నా సోదరుడు మేకలకు మేత తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లగా, ఆయన భార్య కట్టెలు తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఆత్యాచార సంఘటన జరిగిందని బాధితురాలి బాబాయి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.