ఫాదర్స్ డే రోజు కాలయముడైన తండ్రి.. పెళ్లి చేసుకోను అన్నందుకు..
షాజహాన్పూర్ : ప్రపంచంలో పిల్లలంతా ఫాదర్స్ డే సంబురాల్లో మునిగిపోతే ఆ అమ్మాయి మాత్రం కన్నతండ్రి గుర్తొస్తే భయంతో వణికిపోతోంది. పెళ్లి చేసుకోనన్న పాపానికి తండ్రి కత్తితో పొడిచిన పోట్లు తలచుకుని కంపించిపోతోంది. వద్దు నాన్నా... అని బతిమాలినా కనికరించని ఆ తండ్రి కర్కశత్వాన్ని భరించలేకపోతోంది. ప్రతి ఒక్కరినీ కలిచివేసే ఈ హృదయవిదారక ఘటన యూపీలో జరిగింది.
కేరళలో దారుణం: మహిళా పోలీసు ఆఫీసర్ను నరికి నిప్పుపెట్టిన మరో పోలీసు
పెళ్లి చేస్తామని పట్టుబట్టిన తండ్రి
యూపీ షాజహాన్పూర్కు చెందిన 15ఏళ్ల బాలికకు చదువంటే ప్రాణం. ఆ కారణంగానే పెళ్లి చేస్తామన్న తల్లిదండ్రుల మాటల్ని కాదంటూ వస్తోంది. బాగా చదువుకుని ఉద్యోగం చేస్తానని ఆ అమ్మాయి చెప్పే మాటలు తండ్రికి రుచించేవి కాదు.. కూతురికి బలవంతంగానైనా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న ఆయన.. కూతురిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కుదరకపోవడంతో చివరకు ఆమె ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం కొడుకుతో కలిసి ప్లాన్ వేశాడు.
కత్తితో పొడిచిన తండ్రి
తండ్రి, అన్న పదే పదే పెళ్లి ప్రస్తావన తేస్తుండటంతో అది ఇష్టం లేని ఆ అమ్మాయి రెండు నెలల క్రితం అక్కా బావల దగ్గరకు వెళ్లింది. అక్కడే ఉంటూ చదువు కొనసాగించాలని నిర్ణయించుకుంది. అయితే కూతురిపై కోపం పెంచుకున్న తండ్రి, సోదరుడు బాలికలు మాయమాటలు చెప్పి తమతో పాటు ఊరికి తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో ఓ కాలువ వద్ద నిర్జన ప్రదేశానికి చేరుకున్న తర్వాత అన్న టవల్ను అమ్మాయి గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేయగా.. తండ్రి కత్తితో పలుమార్లు పొడిచాడు. కత్తి పోట్లకు తాళలేక ఆ అమ్మాయి వద్దు నాన్నా అని బతిమాలినా తండ్రి మాత్రం కనికరం చూపలేదు.
కాలువలో ఈదుకుంటూ వెళ్లి
పలుమార్లు కత్తితో పొడిచిన అనంతరం తండ్రీ కొడుకులు ఆ అమ్మాయిని కాలువలోకి తోసేశారు. కొద్ది సేపటికి మళ్లీ తిరిగొచ్చి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిందా లేదా అని చెక్ చేశారు. అయితే ఈలోపే ఆ అమ్మాయి ఈదుకుంటూ కాస్త ముందుకెళ్లి ప్రాణాలు దక్కించుకుంది. ఒడ్డుకు చేరుకున్న అనంతరం ఆ అమ్మాయిని గమనించిన కొందరు స్థానికులు ఆమె బావకు ఫోన్ చేయడంతో అతను హాస్పిటల్లో చేర్పించాడు. ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకున్నారు. అమ్మాయి చేస్తున్న ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. బాలిక తండ్రితో పాటు అన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసినట్లు తేలితే ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.