ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం... మైనర్ బాలికపై అత్యాచారం... ముక్కలుముక్కలుగా శరీరం...
ఓవైపు హత్రాస్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగానే మరోవైపు ఉత్తరప్రదేశ్లో వరుస అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ దళిత మైనర్ బాలిక మృతదేహం లభ్యమైంది. సెప్టెంబర్ 26న కనిపించకుండా పోయిన ఆ బాలిక మృతదేహాన్ని ఓ పంట పొలంలో ముక్కులై పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. బాలికపై దుండగులు అత్యాచారం జరిపి హత్యకు పాల్పడ్డారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరూ బాలిక బంధువులే అని చెప్తున్నారు. బాలిక శరీర భాగాలను పోస్టుమార్టమ్కు పంపించామని... ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాలిక దళిత సామాజికవర్గానికి చెందినదని చెప్పారు.
ఘటనపై మృతురాలి తండ్రి మాట్లాడుతూ... కొన్నాళ్లుగా తాము భూ వివాదాన్ని ఎదుర్కొంటున్నామని... దానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు తమను బెదిరింపులకు గురిచేశారని చెప్పారు. ఆ ఇద్దరు వ్యక్తులే తమ బిడ్డను బలితీసుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి బయటకొచ్చిన కొన్ని వీడియోల్లో భారీ సంఖ్యలో పోలీసులు మృతదేహం పడివున్న పొలాల వైపు వెళ్లడం కనిపిస్తోంది. అక్కడ ముక్కలు ముక్కలుగా పడివున్న బాలిక శరీర భాగాలను చూసి ఆమె కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు.
సాధారణంగానే క్రైమ్ రేటు ఎక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్లో గత కొన్నాళ్లుగా మహిళలపై ఆకృత్యాలు మరింత పెరిగిపోయాయి. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన వెలుగుచూశాక మరో నాలుగైదు ఘటనలు ఇలాంటివే బయటకొచ్చాయి. మీరట్లో కదులుతున్న ఓ బస్సులో మహిళపై అత్యాచారం జరగా... బలరాంపూర్లో ఓ యువతి కిడ్నాప్కి గురైంది. ఇక ఇదే హత్రాస్లోనూ మరో యువతిని ఓ టెంపో డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇలా మహిళలపై వరుసగా చోటు చేసుకుంటున్న అత్యాచారాలతో యోగి సర్కార్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.