బ్రాహ్మణులకు గన్ లైసెన్సులు..? యూపీ సర్కార్ అసాధారణ లేఖ... అసలేం జరిగింది...
గత మూడేళ్లలో ఉత్తరప్రదేశ్లో ఎంతమంది బ్రాహ్మణులు హత్యకు గురయ్యారు.. ఎంతమంది హంతకులు అరెస్టయ్యారు... ఎంతమంది దోషులుగా తేల్చబడ్డారు... అసలు బ్రాహ్మణుల రక్షణ కోసం ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలేంటి...? ఓ బీజేపీ ఎమ్మెల్యే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలివి. దీనిపై స్పందించిన ప్రభుత్వం అన్ని జిల్లాల మెజిస్ట్రేట్స్కు ఓ అసాధారణ లేఖ రాసింది. రాష్ట్రంలో ఎంతమంది బ్రాహ్మణులు గన్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నారు...వారిలో ఎందరికి లైసెన్స్ వచ్చింది..? అన్న వివరాలు ప్రభుత్వానికి పంపించాలని లేఖలో కోరింది.
ఎవరా లేఖ రాసింది...
ఉత్తరప్రదేశ్లోని లంబువా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే దేవమణి ద్వివేది అగస్టు 16న అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఓ లేఖ రాశారు. అందులో గత మూడేళ్లలో ఎంతమంది బ్రాహ్మణులు రాష్ట్రంలో హత్యలకు గురయ్యారు... ఎంతమంది హంతకులు అరెస్టయ్యారు... ఎంతమంది దోషులుగా తేల్చబడ్డారు... అసలు బ్రాహ్మణుల రక్షణ కోసం ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలేంటి... ప్రాధాన్యత ఆధారంగా ప్రభుత్వం బ్రాహ్మణులకు ఆయుధ లైసెన్సులు ఇస్తుందా... ఇప్పటివరకూ ఎంతమంది బ్రాహ్మణులు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నారు... అందులో ఎంతమంది లైసెన్సులు ఇచ్చారు... అన్న ప్రశ్నలు సంధించారు.
అగస్టు 21 లోపు సమాచారం ఇవ్వాలని...
ద్వివేది లేఖపై స్పందించిన ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలు కోరుతూ అన్ని జిల్లాల మెజిస్ట్రేట్స్కు లేఖలు రాసింది. మూడు రోజుల్లోగా వివరాలు పంపించాలని రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ ప్రకాష్ చంద్ర అగర్వాల్ లేఖ ద్వారా మెజిస్ట్రేట్స్ను కోరారు. 'ఎంతమంది బ్రాహ్మణులు ఆయుధ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.. అందులో ఎంతమందికి లైసెన్సులు వచ్చాయి... తగిన వివరాలతో పాయింట్ల వారీగా అగస్టు 21,2020లోపు ఈమెయిల్ ద్వారా ఈ సమచారాన్ని పంపించండి.' అని కోరారు. అయితే కేవలం ఒక జిల్లా నుంచి మాత్రమే ఆ సమాచారం ప్రభుత్వానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
కొట్టిపారేసిన అధికారి....
అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ దూబే మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. ప్రభుత్వం నుంచి అలాంటి వివరాలను తాము కోరలేమని,అసలు అలాంటి ప్రశ్నలను పరిగణలోకి తీసుకోలేమని పేర్కొన్నారు. జిల్లా మెజిస్ట్రేట్స్కు లేఖలు పంపించిన అధికారి అగర్వాల్ దీనిపై స్పందించేందుకు నిరాకరించగా... మరో సీనియర్ అధికారి మాట్లాడుతూ... ఆ ప్రక్రియ ఇప్పుడు కొనసాగట్లేదని చెప్పారు. అటు ఎమ్మెల్యే ద్వివేది కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. 'దానిపై నాకెలాంటి సమాచారం లేదు. ఇప్పుడు నేను వాళ్లతో టచ్లో కూడా లేను..' అని చెప్పారు.
ఎందుకీ చర్చ మొదలైంది....
గత నెలలో కాన్పూర్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్ తర్వాత ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణుల హత్యపై చర్చ మొదలైంది. వికాస్ దూబేతో పాటు ఎన్కౌంటర్లలో మరణించిన అతని ఐదుగురు అనుచరులు బ్రాహ్మణులే. ఈ ఏడాది జూన్-జులై నెలల్లో మొత్తం 23 మంది బ్రాహ్మణులు హత్యకు గురయ్యారని గతంలో అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు రాజేంద్రనాథ్ త్రిపాఠి ఆరోపించారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఉంచాహర్లో ఐదుగురు బ్రాహ్మణులు సజీవ దహనం గావించబడ్డారని ఆరోపించారు. యోగి అధికారంలోకి వచ్చాక... గత రెండేళ్లలో మొత్తం 500 మంది బ్రాహ్మణులు హత్యకు గురయ్యారని ఆరోపించారు.
Recommended Video
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా బ్రాహ్మణులు
ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణుల ఓటు బ్యాంకు 10శాతమే అయినప్పటికీ సామాజిక,రాజకీయ సమీకరణాల్లో వారి ప్రభావం చాలా బలీయమైనది. కానీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చాక బ్రాహ్మణులు ఆ పట్టు కోల్పోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే క్రమంలో బ్రాహ్మణ సామాజికవర్గాన్ని తమవైపుకు తిప్పుకోవడానికి బీఎస్పీ,ఎస్పీ,ఆమ్ ఆద్మీ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. బ్రాహ్మణ వర్గం తమకు ఓట్లు వేస్తే వారు ఆరాధించే భగవాన్ పరుశురాం పేరుతో ఆస్పత్రులు నిర్మిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇటీవలే ప్రకటించారు. బ్రాహ్మణ వర్గాన్ని అభద్రతా భావానికి గురిచేసే పనులు చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అటు ఎస్పీ అధినేత అఖిలేశ్ సైతం... తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణుల కోసం 108 అడుగుల ఎత్తయిన పరుశారం విగ్రహం నిర్మిస్తామని చెప్పారు.