విద్యార్థుల తరలింపు.. యూపీ సర్కార్ చేసింది తప్పా.. విపక్షాల ఆగ్రహం దేనికంటే !!
భారతదేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది . కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సడన్ గా లాక్ డౌన్ ప్రకటించటంతో చాలా మంది ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వాలు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఆహారాన్ని అందిస్తామని చెప్తున్నా ప్రభుత్వ సాయం అందరికీ అందటం లేదు.
కోటాలో చిక్కుకున్న వారి కోసం బస్సులు నడిపిన యూపీ
ఇక ఇదే సమయంలో లాక్డౌన్ కారణంగా రాజస్థాన్ కోటాలో చిక్కుకున్న వందలాది మంది విద్యార్ధులను తరలించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక బస్సులను పంపించడం విద్యార్థులకు ఒకింత ఊరట . అయితే ఈ నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదమవుతుంది. యూపీ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మూడు వందల బస్సులను రాజస్థాన్ పంపించింది. ఇక కోటాలో మెడికల్, ఇంజినీరింగ్ కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. లాక్డౌన్ తో యూపీకి చెందిన విద్యార్ధులు 9 వేల మంది కోటాలో చిక్కుకుపోయారు. వీరిని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం బస్సులను ఏర్పాటు చేసింది.
యూపీ వైఖరిపై విపక్షాలు ఫైర్ .. పేదలకొక న్యాయం ,విద్యార్థులకొక న్యాయమా
అయితే దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉన్నప్పుడు ఇలా విద్యార్ధులను తరలించడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగీ పై దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా యూపీ వైఖరిపై ఫైర్ అయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ పేద, వలస కూలీలను ఒకే విధంగా తరలించడానికి అనుమతించకపోవడం ఇది అన్యాయం అని అన్నారు.డ్రైవర్లకు, కండెక్టర్లకు గ్లౌజులు, మాస్క్లు అందించి, బస్సులను శానిటైజ్ చేసిపంపుతున్నామని యూపీ ప్రభుత్వం చెబుతున్నా యూపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం తప్పని విపక్షాలు మండిపడుతున్నాయి.
లాక్ డౌన్ ఉల్లంఘించి మరీ తీసుకురావటం అవసరమా అని ప్రశ్న
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో విద్యార్ధులను తరలించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి. వారిని అక్కడే ఉంచి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నిస్తున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు మీరే పాటించకుంటే ఇంకా ప్రజలేం పాటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతమందిని పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నాయి. కరోనా సమయంలో బస్సుల్లో ప్రయాణం చేస్తున్న ఎవరికైనా కరోనా ఉంటె ప్రబలే ప్రమాదం లేదా అని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక వలస కూలీలు వెళ్తామంటే వాళ్ళను పంపించలేదు కానీ విద్యార్థులు కోసం మాత్రం బస్సులు నడుపుతారా ? అలా అయితే పేదలకు జరిగింది అన్యాయమే అని మండిపడుతున్నాయి.
Recommended Video
యూపీ చేసిన పనితో మిగతా రాష్ట్రాలకు తలనొప్పి
మొత్తం యూపీకి చెందిన ఆరు వేల మంది మాత్రమే కాదు వివిధ రాష్ట్రాల నుండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు 32 వేల మంది దాకా ఉన్నారు. ఇక బీహార్ నుంచి 6 వేల 500, మధ్యప్రదేశ్ నుంచి 4 వేల మంది, జార్ఖండ్ నుంచి 3 వేల మంది, హర్యానా నుంచి 2 వేల మంది, మహారాష్ట్ర నుంచి 2 వేల మంది, పశ్చిమబెంగాల్ నుంచి వెయ్యి మంది, ఈశాన్య రాష్ట్రాల నుంచి వెయ్యి మంది వరకు ఉన్నారు. యూపీ చేసిన ప్రయోగంతో ఇప్పుడు విద్యార్థులు మిగతా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచుతున్నారు. తమను ఇళ్ళకు చేర్చటానికి ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరుతున్నారు .యూపీ చేసిన పని మిగతా రాష్ట్రాలకు పెద్ద తలనొప్పిగా మారింది .