ఫాస్ట్ ట్రాక్ ....... మహిళల అత్యాచారాలు, హత్యల విషయంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా దిశ అత్యాచారం ,హత్య ఘటన సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత దిశా ఘటన నిందితుల ఎన్కౌంటర్ సైతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఇదే సమయంలో ఊహించని విధంగా ఉన్నావు లో గ్యాంగ్ రేప్ కు గురైన ఓ బాధితురాలిపై ఆమె కోర్టుకు వెళుతున్న క్రమంలో నిందితులు కిరోసిన్ పోసి సజీవ దహనం చేయడం,ఆసుపత్రిలో నరకయాతన అనుభవించి అత్యాచార బాధితురాలు ప్రాణాలు కోల్పోవడం కూడా దేశాన్ని కదిలించింది.
విషాదం .. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ పై, బిజెపి సర్కార్ పై తీవ్ర విమర్శలు వినిపించాయి. ఇక దీంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని, భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ అత్యాచారం కేసుల సత్వర పరిష్కారానికి 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూపీ మంత్రవర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో 144 మహిళల కేసుల పరిష్కారానికి, 74 బాలికల కేసుల విచారణకు పనిచేయనున్నట్టు యూపీ న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు.యుపిలో ఏర్పాటు చేయనున్న ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం ఒక్కో కోర్టుకు రూ.63 లక్షలు వెచ్చించనున్నట్టు పేర్కొన్నారు.కోర్టుల ఖర్చులో 60 శాతం కేంద్రం భరిస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు చేస్తుంది. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతి సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ను ఇరకాటంలో పెట్టిన నేపథ్యంలో, తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం యూపీలోని బిజెపి సర్కార్ కు ఒకింత ఊరట ఇచ్చిందని చెప్పాలి.