ప్రియాంక గాంధీ ‘1000’ బస్సులకు యూపీ సర్కారు గ్రీన్ సిగ్నల్
లక్నో: వలస కూలీలను తిరిగి సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తాము 1000 బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు తమకు ప్రభుత్వ అనుమతి కావాలంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఆ విన్నపానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అంగీకరిస్తూ ప్రియాంక గాంధీ కార్యాలయానికి లేఖ రాసింది.
చైనాకు రిలీఫ్-ట్రంప్కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..?
అయితే, కాంగ్రెస్ ఏర్పాటు చేసే 1000 బస్సులు, డ్రైవర్ల వివరాలను వీలైనంత తొందరగా ప్రభుత్వానికి తెలియజేయాలని రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి అవనీశ్ అవస్థి.. ప్రియాంక గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రియాంక గాంధీ నుంచి సమాధానం రావాల్సి ఉంది.
వలస కార్మికుల తరలింపు విషయమై ప్రియాంక గాంధీ మే 16న సీఎం యోగి ఆదిత్యనాథ్కు సందేశం పంపించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను తీసుకువచ్చేందుకు తాము 1000 బస్సులను నడుపుతామని చెప్పారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి కావాలని కోరారు.
సరిహద్దులోనే తమ బస్సులు ఉన్నాయని, అనుమతి ఇస్తే వలస కూలీలను తీసుకొస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ప్రియాంక గాంధీ విన్నపానికి అనుమతిస్తూ.. అందుకు సంబంధించిన వివరాలను తెలపాలని కోరింది. యూపీ ప్రభుత్వానికి ప్రియాంక నుంచి సమాధానం వెళ్లాల్సి ఉంది.
12వేల బస్సులు పంపుతున్న యూపీ సర్కారు
కాగా, వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకార్మికులను తీసుకొచ్చేందుకు ఇప్పటికే యూపీ ప్రభుత్వం వేలాది బస్సులను పంపింది. వేలాది మంది కార్మికులు యూపీకి చేరుకున్నారు. తాజాగా 12000 బస్సులను వివిధ రాష్ట్రాలకు పంపుతున్నట్లు యోగి సర్కారు వెల్లడించింది. రాష్ట్రానికి చెందిన వలస కూలీలను తీసుకురావడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడటం లేదని తెలిపింది.