వాహనదారులకు యోగి సర్కార్ షాక్ .. పెట్రోల్ , డీజిల్ ధరలపై వ్యాట్ వాత .. అర్దరాత్రి నుండే
కరోనావైరస్ సృష్టించిన ఆర్ధిక సంక్షోభాల మధ్య ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ ధరలను లీటరుకు 2 రూపాయలు, డీజిల్ను లీటరుకు 1 రూపాయలు పెంచారు. పెంచిన ఇంధన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుండి వర్తిస్తాయి. వ్యాట్ను పెట్రోల్పై లీటరుకు రూ .2, డీజిల్పై రూ .1 చొప్పున పెంచినట్లు యుపి ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా తెలిపారు.ఇదిలావుండగా, యోగి ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం ధరలను రూ .5 నుండి 400 రూపాయల వరకు పెంచింది.
ఇప్పటికే కేంద్రం దేశ ఆర్దిక పరిస్థితి దృష్ట్యా ఈ ఆర్ధిక కష్టాల నుండి గట్టెక్కే మార్గాలను ఎంచుకుంటుంది. లాక్డౌన్ కారణంగా ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న భారత సర్కార్ ఆదాయాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్రం పెట్రోల్పై 10 రూపాయలు, డీజిల్కు 13 రూపాయలు ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన విషయం తెలిసిందే . ఇక కేంద్ర నిర్ణయం తీసుకున్న ఒక రోజు తర్వాత ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
చమురు ధరల తగ్గుదలకు వ్యతిరేకంగా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు వాటిని సర్దుబాటు చేస్తాయని, పన్ను మార్పుల వల్ల పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు ప్రభావితం కాదని కేంద్రం నొక్కి చెప్పింది. ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చే ఎక్సైజ్ సుంకం పెరగడం వల్ల వినియోగదారులకు రిటైల్ ధరలు పెరగవని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. కానీ కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో కోల్పోయిన ఆదాయాన్ని మళ్లీ తిరిగి పొందే ప్రయత్నాల్లో భాగంగా యూపీ పెట్రోల్ పై VATను లీటర్ పై 2రూపాయలు,డీజిల్ పై 1రూపాయిని పెంచి వాహనదారులకు షాక్ ఇచ్చింది .