ఆగ్రాకు ధీటుగా అయోధ్య మాస్టర్ ప్లాన్: ఎయిర్ పోర్ట్, క్రూయిజ్ రైడ్స్, హోటల్స్: కమర్షియల్ చేసేస్తారా?
లక్నో: కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడి జన్మస్థలం అయోధ్య సమగ్రాభివృద్ధిపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఉత్తర్ ప్రదేశ్ లోనే ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆగ్రాకు ధీటుగా అయోధ్యను అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది. దేశ, విదేశాల్లో అయోధ్యకు గుర్తింపు తీసుకుని రావడానికి కార్యాచరణ ప్రణాళికను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అమలు చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టింది. అయోధ్యలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తొలిదశలో 100 కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నంది.
శబరిమలపై తీర్పు: అయ్యప్పస్వామి ఆలయానికి భారీ భద్రత: 10 వేలమంది పోలీసులతో..!
అయోధ్య అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డు..
శతాబ్దాల కాలం పాటు వివాదాల్లో నలిగిన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి దేశ అత్యున్నత న్యాయస్థానం హిందువులకు అనుకూలంగా తెర దించిన విషయం తెలిసిందే. ఫలితంగా- ఇక స్వేచ్ఛగా అయోధ్యను పునర్నిర్మించబోతోంది. అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా అయోధ్య తీర్థ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయనుంది. దీనికి స్వయంగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రే ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. దేశ, విదేశాల నుంచి అయోధ్యలోని రామజన్మభూమిని దర్శించడానికి వచ్చే భక్తుల కోసం విమానాశ్రయాన్ని నిర్మించనుంది. సరయూ నదిలో నౌకా విహారాన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది.
భారీగా హోటళ్లు..
భక్తులకు వసతులను కల్పించడానికి పెద్ద ఎత్తున హోటళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ మున్సిపల్ మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఫైవ్ స్టార్ స్థాయి నుంచి మధ్య తరగతి కుటుంబీకులకు అందుబాటులో ఉండేలా హోటళ్లను ఏర్పాటు చేయాలని సూచనలు జారీ చేసింది. దీనికి ప్రత్యేక నిబంధనలంటూ ఏమీ లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. హోటళ్లతో పాటు బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు కావడానికి అవకాశాలు ఉన్నాయని, అవి ఏర్పాటైతే. .అయోధ్య పవిత్రతను విఘాతం కలుగుతుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. హోటళ్లు అవసరమే అయినప్పటికీ..వాటి నిర్మాణానికి కఠిన నిబంధనలను రూపొందించాల్సి ఉంటుందని అంటున్నారు స్థానికులు.
భారీ బస్ స్టేషన్..
ఉత్తర్ ప్రదేశ్ లోని అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, ఓ మోస్తరు పట్టణాల నుంచి అయోధ్యను అనుసంధానించడానికి ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. రవాణా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి దీన్ని నెలకొల్పవచ్చని సమాచారం. అభివృద్ధి మండలిలో భాగంగా రవాణా పర్యవేక్షణ కోసం ఓ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తారని ప్రతి పట్టణం నుంచి అయోధ్యకు బస్సులను ఏర్పాటు చేయొచ్చని చెబుతున్నారు. దీనికోసం కనీసం 5000 నుంచి 8000 వరకు ప్రయాణికులు ఒకేసారి రాకపోకలు సాగించడానికి వీలు ఉండేలా భారీ బస్ స్టేషన్ ను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.