ఉన్నావ్ యాక్సిడెంట్ కేసు సీబీఐకి బదిలీ..?
సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి రోడ్డు ప్రమాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగానే భావిస్తున్నప్పటికీ ఎలాంటి అనుమానాలకు తావులేకుండా విచారణ జరపాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఇది ప్రమాదం కాదని, దీని వెనుక కుట్ర ఉందని రాజకీయ పార్టీలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
ఉన్నావో భాదితురాలీ ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యేపై హత్యకేసు నమోదు
ఎమ్మెల్యేపై కేసు నమోదు
అత్యాచార ఘటనకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బాధితురాలితో పాటు సాక్ష్యుల్ని హతమార్చేందుకు ఆయన పన్నిన కుట్రలో భాగంగానే రోడ్డు ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కుల్దీప్, అతని సోదరుడు మనోజ్ సింగ్తో పాటు పది మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. మరో 20 మందిపైనా హత్య, హత్యాయత్నం, కుట్ర అభియోగాలు మోపారు.
లోక్సభను కుదిపేసిన ఉన్నావ్ ఘటన
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి ప్రమాదం ఘటనపై లోక్సభలో దుమారం రేగింది. సభలో ఈ అంశాన్ని లేవనననెత్తిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ ఈ ఘటనపై దేశ ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు. ఇది నాగరిక సమాజంపై మాయని మచ్చ అన్నారు. మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేసిన వ్యక్తులే బాధితురాలి కారును లారీతీ ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశారని అధిర్ రంజన్ ఆరోపించారు. ఈ అంశంపై హోం మంత్రి సభలో ప్రకటన చేయాలని, కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
విషమంగా బాధితురాలి పరిస్థితి
2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కేసు విచారణలో భాగంగా గతేడాది ఏప్రిల్ 13న అరెస్టైన నిందితుడు ప్రస్తుతం జైలులో ఉన్నాడు. రాయ్ బరేలీ జైలులో ఉన్న తమ బంధువును కలిసేందుకు వచ్చిన బాధితురాలి బంధువులు, లాయర్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆమె బంధువులు స్పాట్లోనే చనిపోగా.. బాధితురాలితో పాటు ఆమె లాయర్ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వారి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.