ప్రజలపై ప్రతీకారమా?: సీఎం యోగిపై ప్రియాంక వాద్రా తీవ్ర విమర్శలు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హిందూ ధర్మమంటే శాంతికి ప్రతిరూపమని, అలాంటిది కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి ప్రతీకారం అంటూ వ్యాఖ్యలు చేయడమేంటని అన్నారు.
సోమవారం మీడియాతో ప్రియాంక గాంధీ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ యోగి ఆదిత్యనాథ్ ప్రకటించడాన్ని ఆమె తప్పుబట్టారు. భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటామనడం ఇదే తొలిసారని అన్నారు.
కాషాయం అంటే హిందుత్వానికి చిహ్నమని, అందులో హింసకు, ప్రతీకారానికి తావులేదని ప్రియాంక గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు సైతం సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని విమర్శించారు.
తనకు తన భద్రత కంటే యూపీ ప్రజల భద్రత ముఖ్యమని ప్రియాంక వ్యాఖ్యానించారు. మాజీ ఐపీఎస్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న సందర్భంలో దాడి ఘటనను ప్రస్తావించారు. శాంతియుతంగా ఆందోళనలు చేసిన విద్యార్థులపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని కోరారు.
కాగా, అంతకుముందు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ను కలిసి నాలుగు పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఆందోళకారులపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Four demands by the Congress party: Smt. @priyankagandhi pic.twitter.com/A2yS9g4lqG
— Congress (@INCIndia) December 30, 2019
సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో భారీ ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడటం, పోలీసులపై దాడులకు దిగడంతో లాఠీ ఛార్జీ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలు ప్రాంతాల్లో పోలీసులు కాల్పులు జరపడంతో పలువురు ఆందోళనకారులు మృతి చెందారు. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 15మందికిపైగా ఆందోళనకారులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు.
CAA will torment the people of India in the same way Demonetisation did: Smt. @priyankagandhi pic.twitter.com/EJbmi2Uk2q
— Congress (@INCIndia) December 30, 2019