సర్వే తేల్చిన సత్యం: ద్వేషపూరిత నేరాల్లో ఈ రాష్ట్రాలే టాప్
2018లో తొలి ఆరునెలల సమయంలో ద్వేషపూరిత నేరాలు ఉత్తర్ ప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదైనట్లు మానవహక్కుల పరిరక్షణ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్టు ఇచ్చింది. ఇందులో 100 వరకు ద్వేషపూరిత నేరాలు దళితులపై, ఆదివాసీలపై, మైనార్టీ మతాలకు చెందినవారిపై, ట్రాన్స్జెండర్స్పై జరిగినట్లు నివేదిక తెలిపింది.
ద్వేషపూరిత నేరాల్లో 18 నేరాలతో ఉత్తర్ ప్రదేశ్ తొలిస్థానంలో నిలువగా... ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ 13 నేరాలతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రాజస్థాన్, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు నిలిచాయి.
గోవధకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఉత్తర్ ప్రదేశ్లోని హపూర్కు చెందిన మొహ్మద్ ఖాసిం అనే వ్యక్తిని కొందరు గోసేవకులు కొట్టి చంపిన నేపథ్యంలో రిపోర్టు రావడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే రోడ్డుపై అల్లర్ల సందర్భంగా ఖాసిం మృతి చెందాడని గోవధ ఆరోపణలపై ఆయన్ను చంపలేదని పోలీసులు చెబుతున్న అసత్యాలపై సమేదీన్ అనే 62 ఏళ్ల వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
2015లో మొహ్మద్ అఖ్లక్ను యూపీలోని దాద్రిలో గోవధ ఆరోపణలపై హత్య చేసిన తర్వాత ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ పలు పరిశోధనలు చేయడం ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 603 ద్వేషపూరిత నేరాలు నమోదైనట్లు ఆమ్నెస్టీ సంస్థ నడుపుతున్న హాల్ట్ ది హేట్ వెబ్సైట్లో పొందుపర్చింది.
2018లో మొదటి ఆరునెలల్లో 67 ద్వేషపూరిత నేరాలు ఒక్క దళితులపైనే జరుగగా.. మరో 22 ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారిపై చోటుచేసుకున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక గోవధ, పరువు హత్యలు సర్వసాధారణమైపోయాయని రిపోర్ట్ పేర్కొంది.
ఇక ఇలాంటి ఘటనలు ఎక్కువగా పశ్చిమ యూపీలో ఎక్కువగా చోటుచేసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. ఏప్రిల్ 2న దళిత యువకుడిని గుజ్జర్లు కాల్చివేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ మధ్యకాలంలోనే బులంద్షెహర్కు చెందిన వ్యక్తి కొడుకు అగ్రకులం అమ్మాయిని వివాహం చేసుకున్నాడని.. అతన్ని ఉమ్మును అతనే నాకాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పిన ఘటన వెలుగు చూసింది.
ద్వేశపూరిత నేరాలు సాధారణ నేరాలకు మధ్య తేడా ఉందన్నారు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకర్ పటేల్. ద్వేషపూరిత నేరాల వెనక జాత్యాంహకార నెపం దాగిఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే చట్టాలు మాత్రం కొన్ని కారణాల చేత ద్వేషపూరిత నేరాలను ప్రత్యేక నేరాలుగా గుర్తించవన్నారు.
దీంతో ఈ రోజుకీ భారత్లో ద్వేషపూరిత నేరాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేరాలు ద్వేషపూరితమైనవా లేక సాధారణ నేరాలా అన్నది పోలీసులు విచారణ చేసి తేల్చాలని పటేల్ కోరారు. ఒకవేళ ద్వేషపూరిత నేరాలైతే రికార్డు చేయాలని పటేల్ అన్నారు.