ఆయుధాలు కలిగి ఉన్న 517 మందికి నోటీసులు, 148 మందిపై కేసులు, ఆస్తినష్టం అంచనా..
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ యూపీలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన మరుసటి రోజే అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నిరసనలో పాల్గొని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన 28 మందిని రాంపూర్ అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఆయుధాలు కలిగి ఉన్న 517 మంది మీరట్ వాసులకు కూడా నోటీసులు ఇచ్చారు.
21 మంది గుర్తింపు..
ఈ నెల 21వ తేదీన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన 21 మందిని గుర్తించామని కాన్పూర్ కలెక్టర్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. వారి పేర్లతో కూడిన జాబితాను పోలీసులు అందజేశామని తెలిపారు. మరోవైపు రాంపూర్లో 28 మందిని గుర్తించారు. వారు ధ్వంసం చేసిన నష్టం అంచనా వేసి పరిహారం మొత్తం జమచేయాలని నోటీసులు కూడా అందజేస్తామని పేర్కొన్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని అధికారులు చెప్పారు.
25 లక్షల ఆస్తి నష్టం
రాంపూర్లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంపై పూర్తిగా అంచనా వేయలేకపోయామని అధికారులు చెప్పారు. ప్రాథమికంగా 15 లక్షల వరకు గుర్తించామని, మొత్తం విలువ రూ.25 లక్షలు అని పేర్కొన్నారు. మరోవైపు మీరట్కు చెందిన 517 లైసెన్స్ కలిగి ఉన్న ఆయుధం వెంటబెట్టుకున్న వారికి నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్పారు. వారిలో 148 మందిపై కేసులు నమోదు చేసినట్టు వివరించారు.
రెన్యువల్ చేయని ఆయుధాలు
400 ఆయుధాల లైసెన్స్ రెన్యువల్ చేయలేదని పేర్కొన్నారు. రాంపూర్లో హింసకు ప్రేరేపించిన 28 మందికి నోటీసులు అందజేశామని, ఏడురోజుల్లో వివరణ ఇవ్వాలని కోరినట్టు పేర్కొన్నారు. తర్వాత వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.