అఖిలేష్ మనసులో మాట: దేశానికి కొత్త ప్రధానిగా మాయావతి..?
లక్నో: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం కీలకం అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ఒక్క రాష్ట్రం నుంచే 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్లో సమాజ్వాదీ బహుజన్ సమాజ్ వాదీ ఒక్కటై పోటీ చేస్తుండగా ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్కు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఈ క్రమంలోనే సమాజ్వాదీ చీఫ్ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశానికి కొత్త ప్రధానిని ఇవ్వబోతున్నాం
ఉత్తర్ప్రదేశ్లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే నేతల ప్రచారాలతో హోరెత్తి పోతోన్న ఆరాష్ట్రం ఇప్పుడు దేశం దృష్టంతా ఆవైపే ఉంది. ఇందుకు కారణం బీజేపీని కేంద్రంలో రాకుండా అడ్డుకునేందుకు రెండు ప్రధాన శత్రువులు ఒక్కతాటిపైకి రావడమే. తాజాగా సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేష్ యాదవ్ పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. దేశానికి కొత్త ప్రధానిని అందివ్వబోతున్నాం అనే సంకేతాలు ఇచ్చారు అఖిలేష్. అయితే అది తన తండ్రి ములాయం సింగ్ మాత్రం కాదని స్పష్టం చేశారు. ఆ కొత్త ప్రధాని ఎవరనేదానిపై పూర్తి ఫలితాలు వచ్చాక మాత్రమే తమ పార్టీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. తన తండ్రి ములాయం సింగ్ ప్రధాని అయితే తనకు సంతోషము అని చెప్పిన అఖిలేష్... ఆయన మాత్రం ఆ పదవికి రేసులో లేరని చెప్పారు. తన తండ్రి ప్రధాని రేసులో లేరంటే అఖిలేష్ మనసులో దేశ ప్రధానిగా మాయావతి ఉండొచ్చని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీపై పెద్దగా ఆసక్తి చూపని అఖిలేష్ రాబోయే ప్రభుత్వంలో తాము కీలకంగా వ్యవహరించాలన్నదే తన కోరిక అని చెప్పారు. 2022లో యూపీకి జరిగే అసెంబ్లీ ఎన్నికలే తన ముందున్న లక్ష్యమని చెప్పారు.
డింపుల్ ఓటమికి కృషి చేస్తున్న పీఎం, సీఎం, డీజీపీ
తమ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన అభివృద్ధి సంక్షేమ ఫలితాలను తిరిగి కొనసాగించాలంటే తమ పార్టీకి మరొక్క అవకాశం ఇవ్వాలని తాను ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. ఇక కేంద్రంలో ప్రధానిని ఎన్నుకునే వారిలో తన పాత్ర కూడా ప్రధానంగా ఉండాలన్న ఉద్దేశంతోనే తాను లోక్సభకు పోటీచేస్తున్నట్లు వివరించారు అఖిలేష్. రాబోవు కొత్త ప్రభుత్వంలో ఉత్తర్ప్రదేశ్ కీలకంగా వ్యవహరించాలన్నదే తన కోరికని చెప్పారు. ఇక తన భార్య డింపులో యాదవ్ ఓటమికి ప్రధాని మోడీ, సీఎం యోగీ ఆదిత్యనాథ్, రాష్ట్ర డీజీపీలు కుట్రలు చేస్తున్నారని... అయినప్పటికీ తన భార్య భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు అఖిలేష్.
మహాకూటమిపై ఎవరి పెత్తనం ఉండదు
ఎస్పీ బీఎస్పీలను బీజేపీ కంట్రోల్ చేస్తోందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు అఖిలేష్. తమను నియంత్రించగల శక్తి ఎవరికి లేదని చెప్పారు. ఒక పార్టీ పెత్తనం తమపై ఉండదని స్పష్టం చేశారు. ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి బీజేపీ విధానాలను అడ్డుకుని తీరుతుందని స్పష్టం చేశారు. ఇక సిట్టింగ్ ఎంపీ అజాంఖాన్ జయప్రదపై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు అఖిలేష్. ఆయన మంచి ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుగా వక్రీకరించి చూపిస్తున్నారని అన్నారు. అజాం ఖాన్ చాలా ముక్కుసూటి మనిషని తాను చేసిన వ్యాఖ్యలను కొందరు చెడుగా చిత్రీకరించి ప్రచారం చేశారని అన్నారు.