లడ్డూ కావాలా నాయనా.. వద్దు బాబోయ్ అంటున్న భర్త... విడాకులు కోరుతూ పిటిషన్
మీరట్ : ఆలుమగలంటే అప్యాయత, అనురాగం మెండు. ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రేమ, అభిమానం. కొందరైతే తమ బెటర్ హాఫ్కు ఏమైనా జరిగితే తట్టుకోలేరు. ఉత్తర్ ప్రదేశ్లో కూడా ఓ వివాహిత అలానే ప్రవర్తించింది. అయితే ఆమె .. తాంత్రికులను ఆశ్రయించడం తప్పయిపోయింది. తన వద్దకొచ్చిన మహిళ అవసరాన్ని క్యాష్ చేసుకొని .. ఉన్నది లేనిది చెప్పింది. ఆమె భర్తకు కేవలం లడ్డూ మాత్రమే పెట్టాలనే నిబంధన విధించడంతో ఆ మహిళ సంసారం బజారునపడింది. తన ఆరోగ్యంపై అతి జాగ్రత్తతో తన భార్య ప్రవర్తిస్తుందని .. తనతో ఉండలేనని విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు భర్త.
పెళ్లై .. పిల్లలు ... కానీ
యూపీలో మీరట్ జిల్లాకు చెందిన భార్య, భర్తల సంసారం సాఫీగా సాగుతుంది. వారికి పెళ్లై 10 సంవత్సరాలు అవుతుంది. వారికి ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఆమె భర్త ఆరోగ్యం బాగుండటం లేదు. దీంతో ఆమె స్థానికంగా ఉండే తాంత్రికురాలిని ఆశ్రయించారు. తన వద్దకొచ్చిన ఆ మహిళ మూఢనమ్మకాన్ని తాంత్రికురాలు క్యాష్ చేసుకుంది. ఆయన ఆరోగ్యం బాగుపడాలంటే .. అంటూ నోటికొచ్చిన నీతులు చెప్పింది. ఆమె చెప్పినవన్నీ నిజమేననుకొని అమాయకంగా నమ్మేసింది బాధితురాలు. ఇంకేముంది భర్తకు పత్యం భోజనం పెడుతూ వస్తోంది. తన భార్య చేష్టలు చూసి చూసి .. విసిగి వేసారి పోయాడు భర్త. చివరికి ఆమెతో ఉండలేననే పరిస్థితికి వచ్చాడు.
వద్దు బాబోయ్ ..
తాంత్రికురాలు చెప్పిన ప్రకారం భర్తకు ఉదయం, సాయంత్ర లడ్డూలు ఇస్తోంది. పొద్దున 4 లడ్డూలు తినాలని .. సాయంత్రం 4 లడ్డూలు పెడుతుంది. మధ్యలో ఏం తినొద్దని షరతు విధించింది. తిండి విషయంలో తన భార్య పట్టింపులతో భర్త విసిగిపోయాడు. ఎంత చెప్పినా ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదనుకున్నాడు. తన పదేళ్ల సంసార జీవితం కూడా వద్దనుకొని .. వీడిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు మీరట్లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్యతో విడాకులు ఇప్పించాలని కోరుతున్నాడు. తిండి విషయంలో ఆమె పెట్టే నిబంధనలను భరించలేనని వాపోయాడు. తన పట్ల జాలి, కరుణ చూపాలని న్యాయస్థానాన్ని కోరాడు. ఈ పిటిషన్పై భార్యభర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.
సమస్యేం కాదే ..
ఫ్యామిలీ కోర్టు ఆదేశాలలో ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిద్దరి మానసిక పరిస్థితిని అంచనా వేశారు నిపుణులు. తాంత్రికురాలు ఏం చెప్పారు ఎందుకీలా ప్రవర్తిసున్నారు అని ప్రశ్నించారు. తొలుత భార్యను .. తర్వాత భర్తను కూడా ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆ వివాహిత ప్రవర్తన అనుమానాస్పదంగా ఏమి లేదని కౌన్సిలర్లు చెప్తున్నారు. తన భర్త ఆరోగ్యాన్ని కేవలం లడ్డూలు తినడం వల్లే బాగవుతుందని భావిస్తోందని చెప్పారు. కానీ దానిని ఆమె భర్త అంగీకరించడం లేదని పేర్కొన్నారు. దీంతో వారి మధ్య విభేదాలు పొడచూపి .. విడాకులకు దారితీసిందన్నారు. కానీ వారి కాపురాన్ని లడ్డూలు కూల్చివేస్తోందని అంశం మాత్రం కలవరపెడుతుంది. దీనిపై మేధావులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.