చిన్న తప్పిదం ఎంత పనిచేసింది... 8 నెలలు జైల్లోనే... మళ్లీ రిపీట్ కావొద్దని మందలించిన హైకోర్టు...
ఒక క్లరికల్ తప్పిదం... అధికారుల మొండి వైఖరి.. అతన్ని అదనంగా 8 నెలలు జైల్లో ఉండేలా చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ రిమాండ్ షీట్లో పేర్కొన్న పేరుకు,బెయిల్ డాక్యుమెంట్లో పేర్కొన్న పేరుకు చిన్నపాటి తేడా ఉండటంతో జైలు అధికారులు అతన్ని విడుదల చేయలేదు. చివరకు మళ్లీ కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప అతనికి జైలు నుంచి విముక్తి కలగలేదు. ఒక చిన్న తప్పిదాన్ని గుర్తించకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించేలా వ్యవహరించిన సదరు జైలు అధికారులపై న్యాయస్థానం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటివి రిపీట్ కావొద్దని మందలించింది.
ఇంతకీ ఏం జరిగింది...
ఉత్తరప్రదేశ్కి చెందిన వినోద్ కుమార్ బరువార్ గతేడాది ఓ కేసులో అరెస్టయి ప్రయాగ్ రాజ్లోని సిద్దార్థనగర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. సెప్టెంబర్ 4,2019న అతను సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. ఆ తర్వాత వినోద్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఏప్రిల్ 9,2020న అతనికి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేసినా జైలు అధికారులు మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు.
'మిడిల్ నేమ్' ఎగిరిపోయింది..
బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్న నిందితుడి పేరులో మిడిల్ నేమ్ ఎగిరిపోయింది. 'వినోద్ కుమార్ బరావూర్'కి బదుల్ 'వినోద్ బరావూర్' అని మాత్రమే పడింది. దీంతో జైలు అధికారులు వినోద్ కుమార్ను విడిచిపెట్టేందుకు అభ్యంతరం చెప్పారు. రిమాండ్ షీట్లో పేర్కొన్న పేరుకు బెయిల్ ఉత్తర్వుల్లో ఉన్న పేరుకు తేడా ఉందని పేచీ పెట్టారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక వినోద్ తలపట్టుకున్నాడు. అలా రోజులు గడిచిపోతూ వచ్చాయి. దీంతో ఏప్రిల్లో విడుదల కావాల్సిన వినోద్... ఇప్పటిదాకా జైల్లోనే ఉండాల్సి వచ్చింది.
ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు...
జైలు అధికారులు తన మాట వినిపించుకోకపోవడంతో వినోద్ మళ్లీ కోర్టునే ఆశ్రయించాడు. బెయిల్ ఉత్తర్వుల్లో తన పేరును సరిదిద్దాలని కోరుతూ హైకోర్టుకు దరఖాస్తు పెట్టాడు. దీంతో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం జైలు సూపరింటెండెంట్ను కోర్టుకు పిలిచి మందలించింది. ఈ విషయంలో మీపై అంతర్గత విచారణ ఎందుకు జరిపించకూడదని ప్రశ్నించింది.జైలు అధికారుల మొండి వైఖరితో ఒక పౌరుడు 8 నెలల పాటు తన స్వేచ్చను కోల్పోవడం సహేతుకమేనా అని నిలదీసింది. ఒక చిన్న తప్పిదాన్ని సాకుగా చూపి జైలు అధికారులు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటివి పునరావృతం కావొద్దని మందలించింది.