ఒకే చెట్టుకు ముగ్గురి మృతదేహాలు.. సోదరుడే హంతకుడు... బయటపడ్డ షాకింగ్ నిజాలు..
ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో పారిపోయిందన్న కారణంతో తోడబుట్టిన సోదరుడే తన చెల్లెల్ని హతమార్చాడు. ఆమెనే కాదు,ఆమె ప్రేమించిన వ్యక్తిని కూడా చంపేశాడు. ఆపై ఓ చెట్టుకు మృతదేహాలను ఓ చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యలుగా చిత్రీకరించాడు. అయితే ఇదంతా తెలిసిన తమ్ముడు.. ఎక్కడ ఇవన్నీ బయటపడుతాయేమోనని చివరకు అతన్ని కూడా హత్య చేశాడు. అతని మృతదేహాన్ని కూడా అదే చెట్టుకు వేలాడదీశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపెట్టాడు.
అసలేం జరిగింది...
ఉత్తరప్రదేశ్ సంబల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బంటీ,సుఖియా చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ బంధువులే. అయితే ఇటీవల బంటీకి అతని కుటుంబం వేరే అమ్మాయితో వివాహం ఖాయం చేసింది. జూన్ 28న అతని పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ఆ పెళ్లి బంటీకి ఇష్టం లేదు. ఇదే క్రమంలో సఖియా,బంటీ కలిసి జూన్ 25న ఇంట్లో నుంచి పారిపోయారు. అప్పటినుంచి సుఖియా సోదరుడు వినీత్ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ఇంట్లో నుంచి పారిపోయి కుటుంబ పరువు తీసిందని చెల్లెలిపై కక్ష పెంచుకున్నాడు.
గొంతు నులిమి హత్య..
ఇంట్లో నుంచి పారిపోయిన బంటీ,సఖియాలను హత్య చేసేందుకు వినీత్ తన ముగ్గురు స్నేహితులతో డీల్ కుదుర్చుకున్నాడు. వారికి రూ.2.5లక్షలు సుపారీ ఇచ్చాడు. ఇదే క్రమంలో ఓరోజు ఆ ముగ్గురు స్నేహితుల్లో ఒకరైన జగ్పాల్ బంటీ,సఖియా జంటను ఓ పంట పొలం వద్ద గమనించాడు. వెంటనే వినీత్కి సమాచారం ఇవ్వడంతో... నలుగురు కలిసి అక్కడికి వెళ్లారు. బంటీ,సఖియాలను పట్టుకుని గొంతు నులిమి ఇద్దరినీ హత్య చేశారు.
అదే చెట్టుకు వేలాడిన కుల్దీప్ మృతదేహం...
హత్యానంతరం ఇద్దరి మృతదేహాలను అక్కడే ఓ చెట్టుకు వేలాడదీశారు. ఆపై వినీత్ ఓ కట్టు కథ అల్లాడు. ఇంట్లో నుంచి పారిపోయామన్న భయంతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని ప్రచారం చేశాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదే క్రమంలో జూలై 7న అదే చెట్టుకు వినీత్ సోదరుడు కుల్దీప్ కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. పోలీసులకు అనుమానం వచ్చి వినీత్ను అదుపులోకి తీసుకుని విచారించారు.
Recommended Video
నేరం అంగీకరించిన వినీత్...
పోలీస్ విచారణలో వినీత్ నేరం అంగీకరించాడు. బంటీ,సఖియాలను హత్య చేసిన విషయం కుల్దీప్కు తెలుసునని... అతను మొదటినుంచి ఈ విషయంలో తనను వ్యతిరేకిస్తుండటంతో... ఎక్కడ హత్యల గురించి బయటపెడుతాడేమోనని అతన్ని కూడా హత్య చేసినట్లు చెప్పాడు. బంటీ,సఖియాలను కూడా స్నేహితుల సహాయంతో హత్య చేసి చెట్టుకు ఉరేసినట్లు తెలిపాడు. కుటుంబ పరువు పోయిందన్న ఉద్దేశంతోనే హత్యలకు పాల్పడ్డట్లు చెప్పాడు. పోలీసులు మిగతా ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.