యువతికి ఆరెస్సెస్ కార్యకర్త వేధింపులు.. కొన్ని నెలలుగా టార్చర్... తండ్రితో చెప్పడంతో....
ముజఫర్నగర్ : పోకిరిలా ఆగడాలు శృతిమించుతున్నాయి. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. వారి వేధింపులు తాళలేక అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు. కొందరేమో తమ బాధను చెప్పుకుంటారు. మరికొందరు తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. అలా యూపీలో ఓ పోకిరి యువతిని ఏడిపించాడు. కొన్ని నెలలుగా టీజ్ చేయడంతో ఆమె విషయాన్ని పేరెంట్స్కు చెప్పింది. అతడిని మందలించాల్సిన పెద్దలు .. ఏకంగా హతమార్చారు. యూపీలోని ముజఫర్నగర్లో జరిగిన ఘటన కలకలం రేపింది.
ఆ యువతిని వేధించిన పోకిరి ఆరెస్సెస్ సభ్యుడు కావడం విశేషం. ముజఫర్నగర్ జిల్లా కార్వా గ్రామానికి చెందిన కావార్పల్కు మోను అనే కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. అయితే కూతురిని గత కొన్ని నెలలుగా పంకాజ్ అనే ఆరెస్సెస్ కార్యకర్త వేధిస్తున్నాడు. ప్రేమ పేరుతో టార్చర్ పెట్టాడు. ఆ వేధింపులు తాళలేక యువతి జరిగిన విషయాన్ని తన తండ్రితో చెప్పింది. అయితే తండ్రి కావార్పల్ మాత్రం పంకజ్ను మట్టుబెట్టాలని భావించాడు. ఇందుకు తన కుమారుడు మోను, అతని సోదరుడు ప్రమోద్ జట్టుకట్టారు.
శనివారం కార్వారా గ్రామంలోనే పంకజ్ను మట్టుబెట్టారు. మరునాడు జరిగిన విషయం తెలిపి పోలీసులకు లొంగిపోయాడు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కావార్పల్, మోను లొంగిపోయారని .. మూడో నిందితుడు ప్రమోద్ ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అతని పట్టుకొంటే ఈ హత్యకు గల కచ్చితమైన కారణాలు తెలియరావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.