'గ్యాంగ్ రేప్స్ కు కేరాఫ్ బులంద్ షహార్'; ప్రతిపక్షాలే కుట్రేనన్న మంత్రి
దోస్త్ పూర్ (బులంద్ షహార్) : తల్లీకూతుళ్లపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనతో వార్తల్లోకి ఎక్కిన బులంద్ షహార్ పట్టణం గురించి చాలా విషయాలు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం ఆ ప్రాంతంలో అత్యాచార ఘటనలు సర్వ సాధారణమైపోయాయని తెలుస్తోంది. దుండగులను ఎదుర్కొనే ధైర్యం చేయక బాధితులెవరూ పోలీసులను ఆశ్రయించే ప్రయత్నం చేయట్లేదని అక్కడివారు చెబుతున్నారు.
గత శుక్రవారం నాడు జరిగిన తల్లీకూతుళ్ల గ్యాంగ్ రేప్ కంటే 12 రోజుల ముందు అక్కడ మరో అత్యాచార ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు గ్రామస్తులు. రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత కొంతమంది దుండగులు టెంపోలో మహిళలను తీసుకొచ్చి గ్యాంగ్ రేప్ చేశారని వెల్లడించారు. నిర్మానుష్యంగా ఉండే హైవే కావడం.. వీధి లైట్లు కూడా లేకపోవడం.. పోలీసుల పర్యవేక్షణ కొరవడడంతో నేరస్తులకు ఆ ప్రాంతం అడ్డాగా మారిందని అంటున్నారు స్థానికులు.
12 రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై బులంద్ షహార్ గ్రామ సర్పంచ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరుగుతోందన్న విషయం తెలియగానే అక్కడికి వెళ్లామని.. తమ అలికిడి వినగానే నిందితులంతా అక్కడినుంచి పారిపోయారని చెప్పారు సర్పంచ్. ఆ సమయంలో బాధిత మహిళ చాలా నిస్సహాయ స్థితిలో ఉందని, పారిపోయే క్రమంలో ఓ మొబైల్ ఫోన్ తో పాటు కొన్ని దుస్తులను నిందితులు అక్కడి వదిలి పారిపోయారని చెప్పారు.
అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులకు ఆ వస్తువులను ఇచ్చామని.. నిస్సహాయ స్థితిలో ఉన్న బాధిత మహిళకు పోలీసుల సహాయం చాలా అవసరం పడిందని వివరించారు సర్పంచ్. ఎన్ని అత్యాచారాలు జరిగినా.. ఫిర్యాదు చేయడానికి మాత్రం ఎవరూ ధైర్యం చేయట్లేదని గోవింద్ పాల్ సింగ్ అనే స్థానికుడు చెప్పాడు. పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే తరుచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు స్థానికులు.
కొట్టిపారేసిన పోలీసులు :
మరోవైపు పోలీసులు మాత్రం గ్రామస్తుల ఆరోపణలను కొట్టిపారేశారు. అత్యాచార ఘటనలపై స్పందించిన మీరట్ రేంజ్ డీఐజీ లక్ష్మీసింగ్.. పర్యవేక్షణలో లోపాలు ఉండవచ్చు గానీ పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. నిందితులను పట్టుకోవడం కోసం తాము చేయాల్సిందంతా చేస్తున్నామన్న డీఐజీ.. విధుల పట్ల అలసత్వం ప్రదర్శించినందుకు 12 మంది పోలీసులను కూడా సస్పెండ్ చేసినట్లుగా తెలిపారు.
ఇదంతా బీజేపీ కుట్రనే : మంత్రి అజంఖాన్
తల్లీకూతుళ్ల సామూహిక అత్యాచారం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపిస్తున్నాయి అక్కడి ప్రతిపక్షాలు. ఘటనపై వైఫల్యానికి సీఎం అఖిలేష్ యాదవ్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు బాధిత మహిళలను కలిసి పరామర్శించడంతో.. ఇదంతా ప్రతిపక్షాల కుట్రనే అని ఆరోపిస్తున్నారు ఉత్తరప్రదేశ్ మంత్రి అజంఖాన్.
రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు ఈ కుట్ర చేశాయని ఆరోపించారు అజంఖాన్.
మాకు న్యాయం కావాలి : బాధిత కుటుంబం
గ్రామస్తులు, నేతల మాటలు ఎలా ఉన్నా.. ఘటన విషయంలో మాత్రం తమకు న్యాయం జరగాలని విజ్నప్తి చేస్తున్నారు బాధిత మహిళల కుటుంబ సభ్యులు. బాధిత కుటుంబానికి చెందిన 39 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ ఘటనపై స్పందిస్తూ.. 'తమకు రాజకీయ నేతల పరామర్శలు అక్కర్లేదని, తమకు కావాల్సింది రాజకీయం కాదని ఘటనకు సంబంధించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.