నన్ను చంపేస్తారు: కాపాడాండంటూ మోడీ, యోగికి మంత్రి భార్య వేడుకోలు
లక్నో: తన తన భర్త చంపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఏకంగా ఓ మంత్రి భార్య ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటూ లేఖ రాసింది. మోడీ సార్, యోగి సార్ నా భర్త నన్ను చంపేయాలని చూస్తున్నాడని, నన్ను కాపాడాలంటూ యూపీ మంత్రి బాబు రామ్ నిషాద్ భార్య నీతూ నిషాద్ ఈ మేరకు వేడుకుంటోంది.
గురువారం నీతూ నిషాద్ మీడియాతో మాట్లాడుతూ.. భర్త(మంత్రి బాబు రామ్ నిషాద్) వేధింపులు తట్టుకోలేక విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. అయితే, అప్పటి నుంచి ఆయన తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని వెల్లడించింది.
తనను తుపాకీతో కాల్చి చంపాలని ప్రయత్నిస్తున్నారని నీతూ నిషాద్ వాపోయింది. ఈ విషయమై అనేక సార్లు పోలీస్ స్టేషన్లో తన భర్తపై ఫిర్యాదు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి పదవి అడ్డం పెట్టుకుని వేధిస్తున్నాడని భర్తపై ఆరోపించింది.
సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పినప్పటికీ.. వినకుండా తనను శరీరకంగా హింసించాడని వాపోయింది. బాబు రామ్ నిషాద్ మంత్రి కావడంతో పోలీసులు కూడా అతనిపై కేసు పెట్టేందుకు వెనుకాడుతున్నారని తెలిపింది. అందుకే తాను ప్రధాని నరేంద్ర మోడీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాసినట్లు నీతూ నిషాద్ వెల్లడించారు.
ఇది ఇలావుంటే, యూపీ బ్లాక్వర్డ్ క్లాస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, రాష్ట్ర మంత్రి బాబురామ్ నిషాద్ తన భార్య ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఖర్చుల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండటంతోనే తాను విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
తన భార్య ఎప్పుడూ తనతో గొడవలు పెట్టుకునేదని, ఎప్పుడూ పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని డిమాండ్ చేసేదని మంత్రి రామ్ నిషాద్ చెప్పుకొచ్చారు. దుబారా ఖర్చులు చేసేదని చెప్పారు.