మంత్రిని బలి తీసుకున్న కరోనా వైరస్: రెండు వారాలుగా పోరాడుతూ: షాక్లో యోగి సర్కార్
లక్నో: కరోనా వైరస్ ఉధృతిని సామాన్యులనే కాదు.. ప్రముఖులు, ప్రజా ప్రతినిధులనూ కాటు వేస్తోంది. పొట్టన పెట్టుకుంటోంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, దేవాదాయ శాఖ మాజీమంత్రి పైడికొండాల మాణిక్యాల రావును బలి తీసుకున్న కరోనా వైరస్ కాటుకు..ఈ సారి కేబినెట్ మంత్రి బలి అయ్యారు. ఉత్తర ప్రదేశ్ మంత్రి కమలా రాణి వరుణ్.. కరోనా వైరస్ బారిన పడి కొద్దిసేపటి కిందటే కన్నుమూశారు. ఆమె వయస్సు 52 సంవత్సరాలు.
కమలారాణి మరణం పట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కమలా రాణి వరుణ్.. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. కిందటి నెల 18వ తేదీన ఆమె కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ఆమెను రాజధాని లక్నోలోని సంజయ్గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఇన్స్టిట్యూట్కు తరలించారు. అత్యవసర చికిత్సను అందించారు.
అయినప్పటికీ.. ఆమె ఆరోగ్య పరిస్థితులు మెరుగు పడలేదు. రెండు రోజుల కిందట ఆరోగ్యం మరింత విషమించింది. ఫలితంగా కమలారాణిని వెంటిలేటర్పై ఉంచి, చికిత్స అందించారు. ఫలితం దక్కలేదు. ఆదివారం తెల్లవారు జామున ఆమె తుదిశ్వాస విడిచారు. 1958 మే 3వ తేదీన ఆమె లక్నోలో జన్మించారు. భారతీయ జనతా పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1989లో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగారు. బీజేపీ తరఫున కాన్పూర్ మున్సిపాలిటీకి ఎన్నికయ్యారు. క్రమంగా మంత్రి స్థాయికి ఎదిగారు.
Recommended Video
ఘాతమ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాతమ్పూర్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో చేరారు. కమలారాణి మరణం పార్టీకి తీరనిలోటు అని యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. పార్టీలో ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. పేద ప్రజలకు చేరువగా ఉండటానికి అహర్నిశలు శ్రమించారని చెప్పారు. సేవా భారతి తరఫున పేద పిల్లలకు ఉచితంగా విద్యను అందించడంపై తనదైన ముద్రను వేశారని అన్నారు.