వివక్ష కాదా..? : బాధిత ముస్లిం కుటుంబాలను పరామర్శించని యూపీ మంత్రి
ఇటీవల ఉత్తరప్రదేశ్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చి పోలీసుల లాఠీచార్జి,కాల్పుల్లో 16 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఉత్తరప్రదేశ్ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ బిజనౌర్లో పర్యటించారు. అయితే మృతి చెందిన ముస్లిం వ్యక్తుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన నిరాకరించడం గమనార్హం.
ఆ విధ్వంసకారుల ఇంటికి తానెందుకు వెళ్లాలని మంత్రి అగర్వాల్ ప్రశ్నించారు. విధ్వంసకాండలో పాల్గొని బిజనౌర్ను తగలబెట్టినవారి కుటుంబాలను తానెందుకు పరామర్శించాలని అన్నారు. అదే సమయంలో ఓం రాజ్ సైని అనే బాధితుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇటీవలి హింసాకాండలో గాయాలపాలై సైని చికిత్స పొందుతున్నాడు.
కొంతమంది వ్యక్తులను పరామర్శించి,కొంతమంది వ్యక్తుల కుటుంబాలను మాత్రం పరామర్శించకపోవడం వివక్ష కాదా..? అని అగర్వాల్ను మీడియా ప్రశ్నించింది. అయితే విధ్వంసకారుల ఇంటికి తానెందుకు వెళ్లాలని ఆయన ఎదురు ప్రశ్నించారు. విధ్వంసానికి పాల్పడినవారు, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టినవారు సమాజంలో ఎలా భాగస్వాములు అవుతారని ప్రశ్నించారు. ఇది హిందు-ముస్లిం సమస్య కాదని, విధ్వంసకారుల ఇళ్లకు తాను వెళ్లనని స్పష్టం చేశారు.