భార్య హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్యేను ఆశీర్వదించిన యూపీ సిఎం
భార్య సారాసింగ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఎమ్మెల్యేతో వేదిక పంచుకోవడంతో పాటు అతడిని ఆశీర్వదించి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇబ్బందుల్లో పడ్డారు.
గోరఖ్ పూర్: భార్య సారాసింగ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఎమ్మెల్యేతో వేదిక పంచుకోవడంతో పాటు అతడిని ఆశీర్వదించి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇబ్బందుల్లో పడ్డారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మహరాజ్ గంజ్ జిల్లాలోని నౌతన్వా నియోజకవర్గంలో స్వతంత్ర్య అభ్యర్థిగా గెలుపొందిన అనున్మణి త్రిపాఠి శనివారం జరిగిన ఓ సమావేశంలో యోగికి కొన్ని సీట్ల దూరంలోనే కూర్చుకొన్నాడు.
కార్యక్రమం మధ్యలో యోగికి నమస్కరించడంతో పాటు పాదాభివందనం చేశాడు. త్రిపాఠి కొన్ని కాగితాలను సిఎంకు అందించారు. దీంతో సభకు హాజరైన బీజేపీ శ్రేణులు ఆశ్చర్యపోయాయి.
భార్య సారాసింగ్ ను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు చంపేసి కారు ప్రమాదంలో మరణించినట్టు నకిలీ సాక్ష్యాలను సృష్టించిందనుకు సీబీఐ అంతకు ముందు త్రిపాఠిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు.
ఈ ఘటనను గోరఖ్ పూర్ యూనిట్ ప్రతినిధి సత్యేంద్ర సిన్హా సమర్థించారు.ప్రజా ప్రతినిధులెవరైనా సీఎంకు పాదాభివందనం చేయవచ్చన్నారు. ఇందులో తప్పేమీలేదన్నారు.
త్రిపాఠి తండ్రి అమర్మణి త్రిపాఠి నౌతన్వాలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ములాయం సింగ్ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆమర్మణితో పాటు ఆయన భార్య ప్రస్తుతం మధుమితా శుక్లా హత్యకేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు.