పేదోడ్ని.. హోటల్లో డబ్బు పోయింది, దొరకకుంటే ఆత్మహత్య చేసుకుంటా: అసెంబ్లీలో ఏడ్చిన ఎమ్మెల్యే
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఓ శాసన సభ్యుడు అసెంబ్లీ సాక్షిగా రోధించారు. తన డబ్బులు పోయాయని, వాటిని తిరిగి రికవరీ చేయకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. సదరు ఎమ్మెల్యే పేరు కల్పనాథ్ పాశ్వాన్. అతను సమాజ్వాది పార్టీ మెహ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. తన డబ్బు చోరీకి గురైందని అసెంబ్లీలో రోదించారు.
ఎమ్మెల్యే కల్పనాథ్ ఆజాంగఢ్లోని ఓ హోటల్లో రూ.10 లక్షలు దాచారు. ఆదివారం రాత్రి హోటల్లో దొంగలు పడి ఆ డబ్బు దోచుకున్నారు. దాంతో కల్పనాథ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అసెంబ్లీలో ఈ విషయం గురించి ప్రస్తావించారు. పోయిన పది లక్షల రూపాయలు తిరిగి ఇప్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ కంటతడి పెట్టారు.
మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, తనకు ఇక్కడ న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్లాలని, తాను చాలా పేదవాడినని, రూ.10 లక్షలు తిరిగి ఇప్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
ఎమ్మెల్యే కల్పనాథ్ విషయం గురించి మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా స్పందిస్తూ.. న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆయన ఒప్పుకొంటేనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. అయితే పేదవాడినని చెప్పుకొంటున్న కల్పనాథ్ అంత భారీ మొత్తాన్ని హోటల్ గదిలో ఎందుకు దాచారన్న విషయం చర్చనీయాంశంగా మారింది.