కూతుర్ని కాపాడేందుకు చిరుతతో పోరాడిన తల్లి
లక్నో: దేవుడు అంతటా ఉండలేడు కాబట్టే తల్లిని సృష్టించాడు. అంతులేని ఆ తల్లి ప్రేమ ఎంత శక్తిమంతమైనదో మరోసారి రుజువైంది. తన నాలుగేళ్ల కూతురు ప్రాణాలను కాపాడేందుకు ఓ తల్లి ఏకంగా చిరుతపులితోనే పోరాటం చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాంలోని లక్నోలో చోటు చేసుకుంది.
మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. కటర్నియాఘాట్ వైల్డ్లైఫ్ సాంక్షుయారీ మోతీపూర్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన ఫూల్మటి(30) అనే మహిళ గత ఆదివారం తెల్లవారుజామున తన ఇద్దరు కూతుళ్లు గుడియా, రీచాలతో పొలం పనులకు వెళ్లింది.
కాగా, అక్కడే పొదల్లో దాక్కున్న చిరుత పులి ఒక్కసారిగా వీరిపై దాడి చేసి 4ఏళ్ల కూతురును పొలాల్లోకి ఈడ్చుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఆ మహిళ పెద్దగా కేకలు వేసింది. అయితే ఆమె అరుపులు ఎవ్వరికీ వినపబడలేదు. దీంతో తన కూతురును కాపాడుకునేందుకు ఆమె ధైర్యంగా ముందుకు కదిలింది.
దాదాపు అరగంటపాటు రాళ్లను పోగు చేసి ఆ చిరుత పులిపై విసరసాగింది. అదే సమయంలో గ్రామస్తులు పలువురు అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి చిరుతను అక్కడ్నుంచి తరిమేశారు.
కాగా, చిరుత దాడిలో ఆ మహిళ, ఆమె కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. గ్రామ పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపించారు.