అఖిలేష్ వర్సెస్ ములాయం: అదంతా ప్యామిలీ డ్రామా.. వెంకయ్య
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార సమాజ్వాదీ పార్టీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. దీనిపై కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు స్పందించారు.
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార సమాజ్వాదీ పార్టీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. దీనిపై కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు స్పందించారు. యూపీలో కుటుంబ నాటకం జరుగుతోందని ఎద్దేవా చేశారు.
యూపీ ప్రజలు ఎస్పీ, బీఎస్పీ పార్టీల పట్ల విసిగిపోయి ఉన్నారన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందన్నారు. బీజేపీ వైపు మళ్లేందుకు ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు.
సమాజ్ వాది పార్టీలో హైడ్రామా
అఖిలేష్ వర్గాన్ని పక్కన పెట్టి నాలుగు రోజుల క్రితం ములాయం ఎన్నికల్లో పోటీ చేసే వారి జాబితాను ప్రకటించారు. పోటీగా అఖిలేష్ యాదవ్ తన వర్గాన్ని మరుసటి రోజు ప్రకటించారు.
దీంతో రెండు రోజుల క్రితం అఖిలేష్ యాదవ్ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు. ఆ తర్వాత శనివారం నాడు అంతా సద్దుమణిగినట్లు కనిపించినా, ఆదివారం మళ్లీ ముసలం కనిపించింది.
మళ్లీ ప్రకంపనలు: అధ్యక్షుడిగా ములాయం స్థానంలో అఖిలేష్, అమర్సింగ్పై వేటు
ఆదివారం ఉదయం అఖిలేష్ యాదవ్, ములాయం సోదరుడు, అఖిలేష్ వర్గం నేత రాంగోపాల్ యాదవ్, పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ భేటీలో అఖిలేష్ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ములాయంను తొలగించారు. అలాగే, అమర్ సింగ్ను పార్టీ నుంచి బహిష్కరించారు. శివపాల్ యాదవ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారు.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నానికే ములాయం సింగ్ యాదవ్ తన తనయుడు అఖిలేష్కు తన పవర్ చూపించారు. రాంగోపాల్ యాదవ్ పైన ఆరేళ్ల పాటు వేటు వేశారు. దీంతో యూపీ రాజకీయాలు.. ప్రధానంగా ఎస్పీలో హైడ్రామా కొనసాగుతోంది.