గడ్డం గీసుకోలేదని ముస్లిం ఎస్సై సస్పెన్షన్- యూపీలో ఘటన.. సిక్కులకు మాత్రమేనంటూ..
ఉత్తర్ప్రదేశ్లో యోగీ ఆదిత్యనాథ్ సర్కారు చర్యలపై ఇప్పటికే అక్కడి జనం మండిపడుతుండగా.. అక్కడి అధికార యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా యూపీలోని భాగ్పత్ ఎస్సైగా పనిచేస్తున్న ఓ ముస్లిం ఎస్సైను గడ్డం గీసుకోలేదనే కారణంతో సస్పెండ్ చేయడం కలకలం రేపుతోంది.
భాగ్పత్ ఎస్సైగా పనిచేస్తున్న ఇంతెసర్ అలీ తాను ఏడాది పాటు గడ్డం పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేశాడు. 25 ఏళ్లుగా పోలీసు శాఖలో పనిచేస్తున్న అలీ.. తాజాగా ఉన్నతాధికారుల అభ్యంతరాల నేపథ్యంలో ఏడాది లోగా గడ్డంపై ఓ నిర్ణయం తీసుకుంటానని, అప్పటిలోగా తనకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ లోపే మూడుసార్లు ఆయనకు నోటీసులు పంపిన అధికారులు చివరికి సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఈ వ్యవహారం సాధారణ ప్రజల్లోనూ చర్చకు దారి తీసింది.
యూపీ పోలీసు మ్యాన్యువల్ ప్రకారం సిక్కులు మినహా మరే ఇతర మతాలకు చెందిన ఉద్యోగులు కూడా గడ్డాలు పెంచరాదు. మిగతా వారంతా తప్పనిసరిగా ఎప్పటికప్పుడు గడ్డం గీసుకోవాల్సిందే. ఒకవేళ గడ్డం పెంచాలంటే మాత్రం ముందస్తు అనుమతి తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. వీటి ప్రకారం ఎస్సై ఇంతెసర్ అలీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోకుండా అతనికి నోటీసులు జారీ చేసి సస్పెన్షన్ వేటు విధించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారుల నుంచి తన దరఖాస్తుపై ఎలాంటి స్పందన రానందునే గడ్డం పెంచుతున్నట్లు అలీ చెబుతున్నాడు.