అయోధ్య తీర్పు: యూపీ అధికారులతో సీజే భేటీ, పరిస్థితులపై ఆరా
అయోధ్య భూ వివాదం తుది తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు తగిన జాగ్రత్తలు తీసుకుంది. అత్యంత సున్నితమైన సమస్య కావడంతో యూపీలో పరిస్థితులను ఆరాతీసింది. ఇవాళ ఉదయం యూపీ అధికారులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సమావేశమయ్యారు.
రాష్ట్రంలోని పరిస్థితులు, శాంతి భద్రతల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీర్పు ఇవ్వడానికి పరిస్థితి బాగుందని.. అధికారులు చెప్పడంతో శనివారం తీర్పు వెలువరిస్తామని స్పష్టంచేశారు. రెండో శనివారం కావడం, పబ్లిక్ హాలీడే కావడంతో ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉంటారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఘర్షణలు చెలరేగే అవకాశం తక్కువని.. చెదురు మదురు ఘటనలను నివారించొచ్చని అధికారులు సూచించారు. వారి సూచనమేరకు సీజేఐ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో న్యాయమూర్తులు ఎస్ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు భద్రతా పెంచాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. అయోధ్య, యూపీలో భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. యూపీలో 24 గంటలు పనిచేసే మాస్టర్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మరోవైపు యూపీకి 4 వేల పారా మిలటరీ దళాలు రంగంలోకి దిగాయి. 30 బాంబ్ స్వ్కాడ్లను కూడా మొహరించారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.