గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్పై కేసు... ఆ వెంటనే వెనక్కి తగ్గిన పోలీసులు...
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో పాటు అదే సంస్థకు చెందిన మరో ముగ్గురు ఉన్నతాధికారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఆ తర్వాత వెనక్కి తగ్గిన పోలీసులు ఎఫ్ఐఆర్ నుంచి వారి పేర్లను తొలగించారు. మొత్తం 17 మందిపై కేసు నమోదు చేయగా... అందులో సుందర్ పిచాయ్ సహా మరో ముగ్గురు గూగుల్ అధికారుల పేర్లను చేర్చారు. కానీ ఈ కేసుతో వీరికి సంబంధం లేదని గుర్తించి పేర్లను తొలగించారు.
వివరాల్లోకి వెళ్తే... ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా ఉన్న వాట్సాప్,యూట్యూబ్లలో ఓ వీడియో సర్క్యులేట్ అవుతోందంటూ వారణాసికి చెందిన ఓ వ్యక్తి బెలుపూర్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు తనకు 8500 బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పాడు. పోలీసులు ఆ వీడియోను పరిశీలించగా అప్పటికే సోషల్ మీడియాలో 5లక్షల మంది దాన్ని వీక్షించారు.
ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 504,506,500,120B కింద కేసు నమోదు చేశారు. ఆశ్చర్యంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేరుతో పాటు భారత్కు చెందిన ముగ్గురు గూగుల్ ఉన్నతాధికారుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. అయితే యూట్యూబ్లో సర్క్యులేట్ అవుతున్న ఆ వీడియోతో వీరికి సంబంధం లేదని గుర్తించడంతో అదే రోజు ఎఫ్ఐఆర్ నుంచి పేర్లను తొలగించినట్లు బెలుపూర్ పోలీస్ అధికారులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న మిగతా వ్యక్తులను విచారిస్తున్నట్లు తెలిపారు.
ఘాజీపూర్కు చెందిన ఓ మ్యూజిషియన్స్ బృందం పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు తెలిపారు. మోదీని కించపరిచేలా ఉన్న ఆ వీడియోను వీరే రూపొందించి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.