‘Uttar Pradesh ki chor police’ బ్లాంకెట్లు, ఆహార వస్తువులు తీసుకెళ్లడంపై ఆగ్రహాం (వీడియో)
ఏదైనా వస్తువు దొంగిలిస్తేనో, విలువైన ఐటెమ్ కనిపించకుండా పోతే పోలీసులను ఆశ్రయిస్తాం. కానీ ఉత్తర ప్రదేశ్లో విచిత్ర ఘటన జరిగింది. మహిళల నుంచి యూపీ పోలీసులు బ్లాంకెట్లు, ఆహార పదార్థాలు తీసుకెళ్లారు. పెద్ద మొత్తంలో సేకరించి.. వ్యానులో తరలించారు. పోలీసుల తీరును మహిళలు తప్పుపట్టారు. 'యూపీ పోలీసు చోర్ హై' అంటూ నినాదించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
నిరసన సెగ
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ లక్నోలో ఘంటఘార్ వద్ద మహిళలు ఆందోళన బాట పట్టారు. ఇటీవల ఢిల్లీలో ఆందోళన చేపట్టిన సహీన్ బేగ్ను ఆదర్శంగా తీసుకొని శనివారం సాయంత్రం 500 మంది మహిళలు నిరసన చేపట్టారు. క్లాక్ టవర్ సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. దీంతోపాటు ఎన్ఆర్సీని కూడా తీసుకురావొద్దని కోరారు.
బ్లాంకెట్లు తీసుకొని..
అయితే అక్కడికి భారీగా పోలీసులు తరలివచ్చారు. ఆందోళన చేస్తున్న వారు శనివారం రాత్రంతా అక్కడ ఉండాలని భావించి.. బ్లాంకెట్లు, ఆహార పదార్థాలు కూడా వెంట తెచ్చుకున్నారు. అక్కడ 500 మంది వరకు మహిళలు ఉండటంతో.. వారిని తరలించడం ఇబ్బంది అనుకున్నారో ఏమో.. వారి ఆహార పదార్థాలు, బ్లాంకెట్లను యూపీ పోలీసులు తీసుకెళ్లారు. అలా వారు తీసుకెళ్తుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేశారు. వాటిని పోలీసు వ్యాన్లో వేసి.. పోలీసు స్టేషన్కు తరలించారు.
యూపీ పోలీస్ చోర్
27 సెకన్ల నిడివిగల వీడియోలో మహిళ ‘యూపీ పోలీసు చోర్' అంటూ నినాదించారు. తమ వస్తువులను తీసుకెళతారా అంటూ నినాదాలు చేశారు. వాస్తవానికి ఆ ప్రాంతానికి పోలీసులు రాకమునుపు కూడా పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. కానీ పోలీసులు వచ్చి వారి దుప్పట్లు, ఆహార పదార్థాలు తీసుకెళ్లడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నెటిజన్లు పోలీసుల తీరును తప్పుపడుతూ కామెంట్లు పెడుతున్నారు.
20 మంది మృతి
సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళన హింసాత్మకంగా దారితీసి 20 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో 11 మంది యూపీకి చెందినవారు కావడం విశేషం.