చేయిచేసుకొని, గొంతునొక్కి, కిందపడేశారు, యూపీ పోలీసులపై శివాలెత్తిన ప్రియాంకగాంధీ
యూపీ పోలీసులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. లక్నోలో పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ యూపీలో ఆందోళన చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ శనివారం వెళ్లారు. అయితే అక్కడ పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని వాపోయారు.
పోలీసుల దాడి
మాజీ ఐపీఎస్ అధికారి దరపురి, కాంగ్రెస్ నేత సదాఫ్ జఫార్ను యూపీలో అల్లర్లకు పాల్పడ్డారని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ప్రియాంకగాంధీ శనివారం తన కార్యకర్తతో కలిసి టూ వీలర్పై వెళుతున్నారు. ఇంతలో తనను మహిళా పోలీసు అధికారి అడ్డుకున్నారని.. చేయి చేసుకున్నారని, గొంతునొక్కి కిందపడేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరామర్శించేందుకు వెళ్తే..
యూపీ అల్లర్లకు సంబంధించి వారం క్రితం జఫార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఆర్ దరపురిని ఈ నెల 19వ తేదీని అరెస్ట్ చేశారు. వారి కుటుంబసభ్యులను కలిసిన తర్వాత ప్రియాంకగాంధీ మీడియాతో మాట్లాడారు. సీనియర్ పోలీసు అధికారి అయిన ధరపురిని అరెస్ట్ చేయడం చూసి తాను ఆశ్చర్యానికి గురయ్యానని ప్రియాంక పేర్కొన్నారు.
కాన్వాయ్ నిలిపివేత..
ప్రియాంకగాంధీ కాన్వాయ్ను గోమ్తి నగర్ వద్ద పోలీసులు ఆపివేశారని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ప్రియాంక గాంధీని కావాలనే పోలీసులు ఆపివేశారని తెలిపింది. ఇదీ ఎస్పీజీ సమస్య కాదని, పోలీసుల తీరు అని మండిపడింది. ఇప్పుడే కాదు గత ఆదివారం బిజ్నూర్లో కూడా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకొన్న సంగతి తెలిసిందే.
దూసుకొచ్చిన కార్యకర్త
మరోవైపు ఉదయం లక్నోలో కూడా ఊహించని ఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రియాంకగాంధీ పాల్గొన్నారు. ఇంతలో ఒకరు వేదికపైకి రావడంతో కలకలం నెలకొంది. వెంటనే భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. ప్రియాంక వారిని వారించి, కార్యకర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడారు. తర్వాత అతనిని కిందకి పంపించివేశారు.