గొంతు నులిమి..మెడపట్టుకుని గెంటారు: ప్రియాంకా ఆరోపణలు, పోలీసుల క్లారిటీ: బలిపశువు అంటూ!
లక్నో: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్ ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపణలపై ఉత్తర ప్రదేశ్ పోలీసు యంత్రాంగం స్పందించింది. ప్రియాంకా గాంధీ ఆరోపణల్లో వాస్తవం లేదని వివరణ ఇచ్చుకుంటోంది. తన స్వార్థ రాజకీయాలకు ప్రియాంకా గాంధీ ఓ మహిళా ఎస్ఐని బలి పశువుగా వాడుకుంటున్నారని ఉత్తర ప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఆరోపిస్తోంది.
మాజీ ఐపీఎస్ నిర్భంధం
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురిని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్బంధించింది. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచింది. ఈ విషయం తెలుసుకున్న తరువాత దారాపురిని పరామర్శించడానికి ప్రియాంకా గాంధీ ఆయన నివాసానికి బయలుదేరారు. ఆ సమయంలో ఆమె వెంట పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ప్రియాంకను అడ్డుకొన్న పోలీసులు
సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీగా తరలి వెళ్తోన్న ప్రియాంకా గాంధీని మార్గం మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో ప్రదర్శనగా వెళ్లడానికి అనుమతి లేదని నిర్బంధించారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆ సమయంలోనే పోలీసులు తనపై చేయి చేసుకున్నారని, తనను మెడపట్టి గెంటారనేది ప్రియాంకా గాంధీ ఆరోపణ. ప్రియాంకా గాంధీపై పోలీసులు దాడి చేశారంటూ సోషల్ మీడియాల్లో ఒక్కసారిగా వార్తలు వెలువడ్డాయి.
గొంతు నులిమి.. మెడపట్టుకొని
కాగా, తన గొంతు నులిమి.. మెడ పట్టుకొని గెంటేశారని ప్రియాంక గాంధీ చేసిన ఆరోపణలపై లక్నో పోలీసులు వివరణ ఇచ్చారు. తాము ఎలాంటి దాడికి పాల్పడలేదని, సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నిరాధారమైనవని అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (ప్రొటోకాల్) డాక్టర్ అర్చనా సింగ్ స్పష్టం చేశారు. దీనిపై ఆమె లిఖితపూరక వివరణను ఇచ్చారు. ప్రియాంకా గాంధీపై దాడి జరిగిందనే వార్తల్లో వాస్తవం లేదని, దీనిపై విచారణ నిర్వహించిన తరువాతే తాము ఈ విషయాన్ని వెల్లడిస్తున్నామని లక్నో ఎస్ఎస్పీ కళానిధి నైథిని వెల్లడించారు.
బలి పశువును చేస్తారా?
ప్రియాంకా గాంధీ తన స్వార్థ రాజకీయాలకు ఓ మహిళా ఎస్ఐని బలిపశువును చేస్తున్నారని ఉత్తర ప్రదేశ్ అధికార ప్రతినిధి శలభ్ మణి త్రిపాఠీ ఆరోపించారు. తన కుటుంబ సభ్యుడు మరణించినప్పటికీ.. ఆ మహిళా ఎస్ఐ తన విధి నిర్వహణలో పాల్గొన్నారని అన్నారు. చిత్తశుద్ధితో విధులను నిర్వర్తించారని చెప్పారు. సాటి మహిళా ఎస్ఐపై ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపణలు చేయడం రాజకీయ దురుద్దేశానికి నిదర్శనమని అన్నారు.