యూపీ ఎన్నికలు: బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అసిమ్ అరుణ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఒకపార్టీ నుంచి మరో పార్టీకి చేరికలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు అధికార పార్టీ నుంచి సమాజ్ వాదీ పార్టీలో చేరగా, కొందరు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరారు. తాజాగా, మాజీ ఐపీఎస్ అధికారి అసిమ్ అరుణ్ అధికార భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఫిబ్రవరి 10, 14 తేదీల్లో జరిగే మొదటి రెండు దశల ఎన్నికలకు 107 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను బీజేపీ ఇటీవల విడుదల చేసింది. మాజీ అధికారిని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ లక్నోలో పార్టీలోకి స్వాగతించారు.
పార్టీలో అసిమ్ అరుణ్ను స్వాగతిస్తూ అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు. "అనుభవం, నిజాయితీ, యువకులకు ఆదర్శంగా ఉండే వ్యక్తి ఈ రోజు బీజేపీలో చేరుతున్నారు. నేను అసిమ్ అరుణ్ని స్వాగతిస్తున్నాను. ఆయన అనుభవంతో బీజేపీ ముందుకు సాగుతుంది, ఆయనలాంటి యువకులు మరింత మంది బీజేపీలో చేరతారు' అని అనుగాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు కొన్ని వారాల ముందు పలువురు ఎమ్మెల్యేల రాజీనామాల మధ్య బీజేపీకి ఇది ఉపశమనంగా భావించవచ్చు. పార్టీలో చేరిన సందర్భంగా అసిమ్ అరుణ్ మాట్లాడుతూ.. "నేను సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను, ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు లభించింది. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు ప్రజాసేవకు అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం నాకు అంత సులభమైందేమీ కాదన్నారు.
బీజేపీ శనివారం తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. గోరఖ్పూర్ నగరం నుంచి యూపీ ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ను పోటీకి దింపింది. ప్రధాని మోడీ డిసెంబర్లో గోరఖ్పూర్లో ఎయిమ్స్ గోరఖ్పూర్తో సహా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీ చేస్తారని గతంలో ఊహాగానాలు వినిపించగా, ఇప్పుడు ఆయన గోరఖ్పూర్ నుంచి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించి 21 మంది కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. సీట్ల పంపిణీని సమతుల్యం చేసేందుకు, మొదటి రెండు రౌండ్లలో 60 శాతం సీట్లను మహిళలకు 10, ఓబీసీలకు 44, ఎస్సీ అభ్యర్థులకు 19 కేటాయించారు. 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించి.. చివరి దశ మార్చి 3న నిర్వహించనున్నారు.