ప్రియాంక చేతికి యూపీ బాధ్యతలు.!రాష్ట్రాల వారిగా పార్టీని పటిష్టం చేస్తున్న కాంగ్రెస్..!!
లక్నో/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు సంభవించబోతున్నాయి. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేసిన మరుక్షణం నుంచి పార్టీని వపట్టాలెక్కించి పరుగులు పెట్టించేంది ఎవరనే అంశంపై కాంగ్రెస్ అదిష్టానంలో లోతైన చర్చ జరుగుతోంది. తాత్కాలికంగా మోతీలాల్ వోరా బాద్యతలు తీసుకున్నప్పటికి పూర్తి స్థాయిలో బాద్యతలు కట్టబెట్టే అభ్యర్ధి కోసం కాంగ్రెస్ అదిష్టానం అన్వేషణ కొనసాగిస్తూనే ఉంది.
అందులో భాగాంగా రాష్ట్రాల వారీగా పార్టీని బలోపేతం చేయాలని అదిష్టానం భావివస్తున్నట్టు తెలుస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయంపై తరువాత పార్టీ పెద్దలు పునర్ నిర్మాణంపై దృష్టి సారించారు. ఉత్తరప్రదేశ్ నుంచే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ పీసీసీ బాధ్యతలు ప్రియాంకా వాద్రాకు అప్పగించారు.ఇప్పటివరకూ తూర్పు యూపీ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ నాయకత్వం యూపీ పగ్గాలు అప్పగించింది.
మొత్తం యూపీ కాంగ్రెస్ ను పియాంక నడిపించనుంది. యూపీలోని 12 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఉపఎన్నికలు జరుగనుండంతో పార్టీని పునరుద్ధరించాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 స్ధానాలకు గాను కాంగ్రెస్ కేవలం ఒక్క స్ధానాన్నే కైవసం చేసుకుంది. రాహుల్ గాంధీ సైతం అమేథిలో ఓటమి పాలయ్యారు. యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ పోటీచేసిన రాయ్బరేలి స్ధానాన్ని మాత్రమే కాంగ్రెస్ దక్కించుకోగలిగింది.
యూపీలో కాంగ్రెస్ ఘోర వైఫల్యంపై ప్రియాంక వాద్రా, వెస్ట్ యూపీ ఇన్చార్జి జ్యోతిరాదిత్య సింధియా పలుమార్లు సమీక్షా సమావేశాలు జరిపారు. ఆ తరువాతే పార్టీ యూపీ విభాగంలో భారీ మార్పులు తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఆ క్రమంలోనే ఇటీవల యూపీలోని అన్ని జిల్లా కమిటీలను ఒకేసారి రద్దు చేశారు. పార్టీ కోసం పనిచేసే వారినే ఎంపిక చేయాలనే నిర్ణయంతో కమిటీలు రద్దయ్యాయి.