భారత్ మాతాకీ జై అనాలి, లేదంటే చర్యలు: షియా వక్ఫ్ బోర్డు ఆదేశాలు
లక్నో: ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతి ఒక్కరు భారత్ మాతాకీ జై నినాదాలు చేయాలని ఉత్తర ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. ఆగస్ట్ 15న తమ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో ఈ నినాదాన్ని తప్పనిసరిగా చేయాలని చైర్మన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఒకవేళ తమ ఆదేశాలను పాటించనట్లయితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయమై షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీమ్ రిజ్వీ మీడియాతో మాట్లాడారు.
ఆగస్ట్ 15న జాతీయ గీతాన్ని ఆలపించిన తర్వాత భారత్ మాతాకీ జై నినాదం చేయాలని చెప్పామని, ఎవరైనా మా ఆదేశాలు పట్టించుకోకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వక్ఫ్ బోర్డు ఆఫీసుల్లో ఈ ఆదేసాలు పాటించేలా చేయడం వాటికి సంరక్షకులుగా ఉంటోన్న వారిదే బాధ్యత అన్నారు.
భారత్ తమ మాతృదేశం అని చెప్పుకోవడానికి ముస్లింలు సంకోచించరని, అలాంటప్పుడు భారత్ మాతా కీ జై అని నినాదం చేయడానికి వెనుకాడవద్దన్నారు.
ఇటీవలే ఆయన ముస్లింలు బీఫ్ తినడం మానేయాలని, ఇతర మతస్థుల మనోభావాలను దెబ్బతీయకూడదన్నారు. గోవధ చేయడం మానాలని, వాటిని చంపడం ఇస్లాంలో నిషేధమని, అలాంటప్పుడే మూకహత్యలు కూడా ఆగుతాయని, అన్నిచోట్లా ప్రభుత్వం భద్రతను ఏర్పాటు చేయలేదని, గోవధ చేసే వారికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలన్నారు. ఒక మతస్థులు తల్లి హోదాను ఇచ్చిన జీవిని చంపడం సరికాదన్నారు.