లవ్ జిహాద్ ఎఫెక్ట్: మతమార్పిడుల వ్యతిరేక బిల్లు 2020కి యూపీ ఆమోదం
లక్నో: 'లవ్ జిహాద్' అనే పదం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. పెళ్లి పేరుతో మతమార్పిడులకు పాల్పడటమే దీని లక్ష్యంగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లవ్ జిహాద్కు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొలుత ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
మతమార్పిడుల వ్యతిరేక బిల్లు 2020కి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని మంత్రిమండలి మంగళవారం ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా యూపీ మంత్రి ఎస్ సింగ్ మాట్లాడారు. ఈ చట్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ బిల్లు అమలులోకి వచ్చినప్పటి నుంచి చట్టవిరుద్ధంగా బలవంతపు మత మార్పిడికి పాల్పడే వారికి 1-5 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, రూ. 15వేల జరిమానా పడుతుందన్నారు. అదే మైనర్లు, దళిత, గిరిజన మహిళలను బలవంతంగా మతమార్పిడికి గురిచేస్తే 3-10ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ. 50వేల జరిమానా పడుతుందన్నారు.
ఇకపై ఎవరైనా పెళ్లి కోసం మతం మారాలనుకుంటే జిల్లా మేజిస్ట్రేట్ నుంచి రెండు నెలల ముందు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రేమ పేరుతో జరిగే బలవంతపు మతమార్పిడులను(లవ్ జిహాద్)ను నివారించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని గతంలోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. యూపీ బాటలోనే మరికొన్ని బీజేపీ రాష్ట్రాలు కూడా అడుగులు వేస్తున్నాయి.