హనుంతప్ప కోసం: యూపీ గృహిణి, మాజీ నేవీ ఉద్యోగి
న్యూఢిల్లీ: సియాచిన్ మంచు చరియల్లో చిక్కుకుపోయి ఆరు రోజుల తర్వాత బయటపడి ప్రస్తుతం ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాన్స్ నాయక్ హనుమంతప్పకు తమ వంతు సాయం చేసేందుకు ముగ్గురు వ్యక్తులు ముందుకొచ్చారు.
లివర్, కిడ్నీ పాడైపోయాయని తెలియడంతో హనుంతప్పకు కిడ్నీ ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ లఖింపూర్కు చెందిన నిధి పాండే అనే మహిళ ఒకరు ముందుకొచ్చారు. నిధి పాండే ఓ సాధారణ గృహిణి. సియాచిన ఘటనలో తొమ్మిది మంది సైనికులు అమరైన విషయం తెలుసుకున్న ఆమె చలించిపోయింది.
దీంతో ప్రాణాలతో బయటపడ్డ కర్ణాటకకు చెందిన హనుమంతప్పకు కిడ్నీ దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్థానిక మీడియా ద్వారా ప్రకటించింది. గతంలో ఆమె భర్త అవయవదానం చేయడంపై అవగాహన సదస్సులు నిర్వహించేవారని ఆమె తెలిపారు.
'లాన్స్ నాయక్ కిడ్నీ ఫెయిల్ అయిందని విన్నాను. అతడి కోసం అవసరమైతే నా కిడ్నీని దానం చేస్తాను' అని రిటైర్డ్ సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ స్వరూప్ ప్రకటించారు. ఢిల్లీలో నివసించే ప్రేమ్ స్వరూప్ బుధవారం హనుమంతప్పకు చికిత్సను అందిస్తున్న ఆర్మీ అండ్ రిసెర్చ్ రిఫరల్ ఆస్పత్రి వద్దకు వచ్చారు.
ఇండియన్ నేవీకి చెందిన మాజీ సెయిలర్ ఎస్.ఎస్ రాజు కూడా సియాచిన్లో ప్రాణాలతో బయటపడ్డ హనుమంతప్పకు తన వంతు సాయం చేయాలని భావించారు. 'ఆర్మీ డాక్టర్లు నా విజ్ఞప్తి... నా లివర్, కిడ్నీ ఏదైనా సరే వీర జవాన్కు అవసరమైతే తీసుకోండి. నన్ను కచ్చితంగా సంప్రదించండి' అంటూ థానే జిల్లా భయాందర్ వాసి అయిన నేవీ మాజీ ఉద్యోగి ప్రకటించారు.
కోన ఊపిరితో పోరాడుతున్న సోదరుడని కాపాడుకుందామంటూ ఈ నేవీ మాజీ ఉద్యోగి పిలుపునిచ్చాడు. కాగా, సియాచిన్లో మంచులో చిక్కుకుపోయి ఆరు రోజుల తర్వాత బతికి బయటపడి ప్రస్తుతం ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాన్స్ నాయక్ హనుమంతప్ప ఇంకా కోమాలోనే ఉన్నారు.
ఆయన పరిస్థితి ప్రస్తుతం తీవ్ర ఆందోళనకరంగా ఉందని.. ఆయన కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతిందని, వెంటిలేటర్పై ఉన్నారని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. అదృష్టవశాత్తూ ఆయన అవయవాలు ఫ్రాస్ట్ బైట్కు (మంచు వల్ల మొద్దుబారిపోవడం) గురి కాలేదని, ఇతరత్రా ఎలాంటి గాయాలు కూడా కాలేదని వివరించింది.
మరో 24 గంటల నుంచి 48 గంటల గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. మరోవైపు హనుమంతప్ప కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ముంబైలో డబ్బావాలాలు బుధవారం ప్రార్థనలు చేశారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.