వీళ్లేం పోలీసులు?: యాసిడ్ దాడి బాధితురాలి పక్కనే కూర్చుని సెల్ఫీలు
యాసిడ్ బాధితురాలు బెడ్ పై విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆమెకు సంరక్షణగా ఉండాల్సిన మహిళా పోలీసులు బెడ్ పక్కనే కూర్చుని సెల్ఫీలు దిగారు.
లక్నో: సెల్ఫీ పిచ్చి ఎంత దారుణంగా ఉందంటే.. ఓ వైపు యాసిడ్ బాధితురాలు బెడ్ పై విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆమెకు సంరక్షణగా ఉండాల్సిన మహిళా పోలీసులు ఆమె బెడ్ పక్కనే కూర్చుని సెల్ఫీలు దిగారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కూతురి పరీక్షల కోసం లక్నో వెళ్లి తిరిగి రైల్లో వస్తున్న ఓ మహిళ(35) నిన్న సామూహిక అత్యాచారానికి గురైంది. గ్యాంగ్ రేప్ కు పాల్పడిన కామాంధులు అనంతరం ఆమెకు బలవంతంగా యాసిడ్ తాగించారు.
ఈ ఘటన అనంతరం మాట్లాడలేని స్థితిలోకి వెళ్లిన బాధితురాలు లక్నో పోలీసులకు జరిగింది నోటితో చెప్పలేక లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. వెంటనే ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమెను చికిత్స నిమిత్తం కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సంరక్షణగా ముగ్గురు మహిళా పోలీసులను నియమించారు.
అయితే సంరక్షణగా వచ్చిన ఈ మహిళా పోలీసులు బాధితురాలి బెడ్ పక్కనే కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలు తీసుకోవడం దిగ్భ్రాంతికి గురిచేయగా, ఈ విషయం ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఓ వైపు యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రి బెడ్ పై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. సాటి మహిళలై ఉండి కూడా ఈ పోలీసులు నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకోవడం అందరికీ ఘోరమైన విషయంలా అనిపించింది.
దీంతో ఈ ముగ్గురు మహిళా పోలీసులపై వెంటనే యాక్షన్ తీసుకుంటూ వారికి సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. వీరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదని, వీరిపై వెంటనే చర్యలు తీసుకున్నామని సీనియర్ పోలీసు అధికారి ఎ.సతీష్ గణేష్ చెప్పారు.
ఈ యాసిడ్ దాడి బాధితురాలిని పరామర్శించేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేరుగా ఆసుపత్రికే వచ్చారు. ఆయన వచ్చి వెళ్లిన తరువాత ఈ సెల్ఫీల బాగోతం చోటు చేసుకుంది. మరోవైపు సీఎం కూడా గా ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిని అరెస్టు చేయమని సీరియస్ చెప్పడంతో.. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను యూపీ పోలీసులు పట్టుకున్నారు.
నిజానికి ఈ మహిళపై 2008 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు సామూహిక అత్యాచారాలు జ.రిగాయి. ఆమె తనకు ప్రొటక్షన్ కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. యాసిడ్ అటాక్ బాధితుల కోసం ఓ కేఫ్ లో పనిచేస్తున్న ఈమె తన కూతురి పరీక్షల కోసం లక్నో వెళ్లి తిరిగి రైలులో వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.