యూపీ మహిళా టీచర్ల నెలసరి కష్టాలు-అధ్వాన్నంగా టాయిలెట్లు- 3 రోజుల పీరియడ్ లీవ్ డిమాండ్
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ లో మహిళా టీచర్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ప్రభుత్వం ముందు వారు ఓ డిమాండ్ పెట్టారు. రాష్ట్రంలోని మహిళా టీచర్లంతా కలిసి ఓ సంఘంగా ఏర్పడి ప్రభుత్వం ముందు పెట్టిన ఈ డిమాండ్ ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో రాష్ట్రంలోని స్కూళ్లలో ఉన్న అధ్వాన్న టాయిలెట్ల పరిస్ధితిని కూడా కళ్లకు కట్టేలా ఉంది. అసలే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు అష్టకష్టాలు పడుతున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు ఇది ఇబ్బందికరంగా మారింది.
యూపీ స్కూళ్లలో అధ్వాన్నంగా మరుగుదొడ్లు
ఉత్తర్ ప్రదేశ్ లోని 75 జిల్లాల్లో ఉన్న వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో ఏవో కొన్ని మినహాయిస్తే మిగతా వన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. వాటిలో మరుగుదొడ్ల పరిస్ధితి అయితే మరింత అధ్వాన్నం. ప్రతీ స్కూల్లోనూ కనీసం 200 నుంచి 400 మంది విద్యార్ధులు చదువుతున్నారు. వీరితో పాటు అక్కడ పనిచేస్తున్న టీచర్లు కూడా వాటిని వాడేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వీటి పరిశుభ్రతతో పాటు రిపేర్లకు ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో మరుగుదొడ్లకు వెళ్లాలంటేనే భయపడే పరిస్ధితి ఉంది.
యూపీ టీచర్ల నెలసరి కష్టాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు అధ్వాన్న స్దితికి చేరుకోవడంతో వాటిని వాడలేక మహిళా టీచర్లు నానా యాతన పడుతున్నారు. వీటిని ఎక్కడ వాడాల్సి వస్తుందోనని నీళ్లు తాగడం కూడా మానేస్తున్నారు. ఆ మరుగుదొడ్లకు వెళితే యూరిన్ ఇన్ ఫెక్షన్లు వస్తాయని భయపడుతున్నారు. ముఖ్యంగా నెలసరి సమయంలో స్కూళ్లకు వచ్చి అక్కడ మరుగుదొడ్లను వాడలేని పరిస్దితుల్లో మహిళా టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని అక్కడ ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. దీంతో కొన్నేళ్లుగా ఈ అధ్వాన్న టాయిలెట్లను వాడలేక, అలాగని నెలసరి సెలవులు తీసుకోలేక మహిళా టీచర్లు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
మహిళా టీచర్ల సంఘం ఏర్పాటు
యూపీలో మహిళా టీచర్లు పడుతున్న కష్టాల్ని ప్రభుత్వం కానీ, అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన వారంతా కలిసి రాష్ట్ర మహిళా టీచర్ల అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న 75 జిల్లాల్లో కనీసం 50 జిల్లాల్లో ప్రభావం చూపగల స్ధితిలో ఇప్పుడు ఈ మహిళా టీచర్ల అసోసియేషన్ ఉంది. దీంతో ఇప్పుడు ఈ సంఘం తరఫున మహిళా టీచర్ల సమస్యలపై వారు పోరాటం మొదలుపెట్టారు. ఉత్తర్ ప్రదేశ్ మహిళా శిక్షక్ సంఘ్ పేరుతో ఏర్పాటైన ఈ అసోసియేషన్ ముందుగా స్కూళ్లలో టాయిలెట్లపై పోరు ప్రారంభించింది. అదే సమయంలో మహిళా టీచర్ల నెలసరి కష్టాలపై దృష్టిసారించింది.
Recommended Video
మూడు నెలసరి సెలవుల డిమాండ్
యూపీలోని స్కూళ్లలో అధ్వాన్న స్ధితిలో ఉన్న టాయిలెట్లలో విసిగిపోయిన మహిళా టీచర్లు ఇప్పుడు తమకు నెలసరి సమయంలో మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు వీరంతా కలిసి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను తరచుగా కలుస్తూ నెలకు మూడు రోజుల నెలసరి సెలవుల డిమాండ్ ను వినిపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజల సాయంతో ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కు ఇది మరో ఇబ్బందిగా మారింది.