కర్ణాటక రాజకీయాలకు సిద్దరామయ్య గుడ్ బై, ఏ పదవి లేదు, సోనియా గాంధీ నిర్ణయం, దేవుడు !
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో తనదైన మార్కు చూపించి ఐదు సంవత్సరాలు పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా పని చేసిన సిద్దరామయ్య ఇప్పుడు కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో తెరమరుగు అయ్యారు. కాంగ్రెస్ లో సిద్దరామయ్యను పట్టించుకునే వారే లేరని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పతో పాటు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్బంలో కర్ణాటక రాజకీయాలకు సిద్దరామయ్య దూరం అవుతున్నారని వెలుగు చూసింది. సిద్దూకు ఏపదవి లేకపోవడంతో సోనియా గాంధీ ఓ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
సోనియా గాంధీ నిర్ణయం
సిద్దరామయ్యను కర్ణాటక రాజకీయాలకు దూరం చెయ్యాలని స్వయంగా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. సిద్దరామయ్యను జాతీయ రాజకీయాల్లో తీసుకెళ్లాలని సోనియా గాంధీ అంటున్నారని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు.
సిద్దూకు ఉపయోగం లేని పదవి
జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం సిద్దరామయ్య కర్ణాటక శాసన సభలో కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నాయకుడిగా ఉన్నారు ఆ పదవితో సిద్దరామయ్యకు ఎలాంటి ఉపయోగం లేదని తెలిసిందే.
కాంగ్రెస్ లో సిద్దూకు వ్యతిరేకం
సిద్దరామయ్యను కేపీసీసీ అధ్యక్షుడిని చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించింది. సిద్దరామయ్యకు ఆపదవి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులకు ఇష్టం లేదు. పైగా మూడు సార్లు అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన డీకే. శివకుమార్ కేపీసీసీ అధ్యక్ష పదవి మీద కన్నేశారు.
కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి
కాంగ్రెస్ హై కమాండ్ దగ్గర సిద్దరామయ్యకు కర్ణాటకలో ఇచ్చే పదవి ఏదీ ప్రస్తుతానికి లేదు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్, డీకే. శివకుమార్ సిద్దరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకోవాలని హైకమాండ్ కు మనవి చేశారని ప్రచారం జరుగుతోంది.
ఎంపీగా పోటీ
కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రధాని మోడీ, అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు దీటుగా సమాధానం ఇస్తు వచ్చిన సిద్దరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఉంటుందని, ఆయన్న ఎంపీగా పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయించిందని సమాచారం.
ఓడిపోయిన సిద్దూ
జాతీయ రాజకీయాల్లోకి సిద్దరామయ్య వెళితే మైసూరు-కొడుగు లోక్ సభ స్థానం లేదా కోప్పళ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఓ సారి కోప్పళ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన సిద్దరామయ్య ఓడిపోయారు.
చివరి ఎన్నికలు
ఇటీవల కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఇదే నా చివరి ఎన్నికలు, బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా తాను ఇకముందు ఎన్నికల్లో పోటీ చెయ్యనని చెప్పిన సిద్దరామయ్య ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెలుతారా లేదా అనే విషయం వేచి చూడాలి.