మీరు చెప్పే మాటలకు పాక్ పండగ చేసుకుంటోంది: విపక్ష పార్టీలపై ప్రధాని ధ్వజం
కన్యాకుమారి: ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. అలా, ఇలా కాదు. తీవ్ర పదజాలంతో నిప్పులు చెరిగారు. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడం, ఉగ్రవాదులను అణచివేయడం కాంగ్రెస్ కు చేతకాదని ధ్వజమెత్తారు. తాము అలా కాదని, జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాదులను సరిహద్దులు దాటి మరీ పీచమణిచి వేశామని అన్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
26/11 ముంబై దాడులకు కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రధాని ప్రశ్నించారు. ఆర్థిక రాజధాని నడి బొడ్డున ఉగ్రవాదులు మారణహోమాన్ని సృష్టిస్తే.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోలేకపోయిందని అన్నారు. ప్రతీకారం తీర్చుకోవడం కాంగ్రెస్ చేత కాలేదని ధ్వజమెత్తారు. తాము ఆ తప్పు చేయలేదని ప్రధాని చెప్పారు. ఉగ్రవాదులపై ప్రతీకార దాడులు చేశామని అన్నారు. యూరీ సెక్టార్ లో సర్జికల్ స్ట్రైక్ చేపట్టామని అన్నారు. తాజాగా పాకిస్తాన్ భూభాగంలో ఉన్న బాలాకోట్ పై వైమానిక దాడులు నిర్వహించి, ఉగ్రవాదులకు తమ సత్తా చాటినట్లు చెప్పారు.
ముంబైపై ఉగ్రవాదుల దాడుల తరువాత కాంగ్రెస్.. అప్పటిదాకా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ లను నిలిపివేసిందని మోడీ అన్నారు. వైమానిక దళ చేతులను కట్టేసిందని ఎద్దేవా చేశారు. తాము వైమానిక దళానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని చెప్పారు. ఎప్పుడు? ఎక్కడ? ఎలా దాడులు చేయాలో నిర్ణయించుకోవాలని కూడా వైమానిక దళానికి సూచించినట్లు ప్రధాని పునరుద్ఘాటించారు. కొద్దిరోజులుగా సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు మనదేశ వైమానిక దళ సత్తాను చాటుతున్నాయని చెప్పుకొచ్చారు.
దాడులు చేస్తే, చూస్తూ కూర్చోవడానికి ఇది పాతతరం భారత్ కాదని, సరికొత్త దేశమని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తోన్న ప్రకటనలు పాకిస్తాన్ కు లబ్ది చేకూర్చేవిగా ఉన్నాయని మోడీ చురకలు అంటించారు. కొంతమంది రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యానాలు, ప్రకటనలను చూసి పాకిస్తాన్ అమితంగా సంతోషిస్తోందని అన్నారు.
వారి ప్రకటనలను పాకిస్తాన్ ప్రభుత్వం తన దేశ పార్లమెంట్ లో ప్రస్తావిస్తోందని, రేడియోల్లో వినిపిస్తోందని మోడీ చెప్పారు. తనను ధ్వేషించే కొన్ని పార్టీలు దేశాన్ని కూడా ధ్వేషించడం మొదలు పెట్టాయని అన్నారు. దేశం మొత్తం మన సైన్యాన్ని ప్రశంసిస్తుండగా..కొంతమంది నాయకులు అదే సైన్యాన్ని అనుమానిస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదంపై చేపట్టిన పోరాటానికి ప్రపంచం మొత్తం మద్దతు ఇస్తుండగా.. సొంత దేశానికి చెందిన పార్టీలు ఈ పోరాటాన్ని ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.