సామాన్యులకు పంగనామాలు, 20శాతం బుద్ధి ఉన్న మూర్ఖులు..: నేతలపై ఉపేంద్ర వివాదాస్పదం
Recommended Video
బెంగళూరు: తాను స్థాపించిన రాజకీయ పార్టీ అన్నింటిలా కాదని చెప్పిన ప్రముఖ కన్నడ సినీ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ అధినేత ఉపేంద్ర కర్ణాటక రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కుమార స్వామి ప్రవేశపెట్టిన బడ్జెట్.. పేదలను పీడించే విధంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సామాన్యులకు పంగనామాలు
పెట్రోల్, విద్యుత్ వంటి వాటిపై పన్నులు పెంచి ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం పేదలపై నేరుగా భారం మోపిందని విమర్శించారు. కొత్త బడ్జెట్తో సామాన్యులకు ప్రభుత్వం పంగనామాలు పెట్టిందంటూ సోషల్ మీడియా వేదికగా ఉపేంద్ర ధ్వజమెత్తారు.
20శాతం బుద్ధి ఉన్న మూర్ఖులు
అంతేగాక, 20శాతం బుద్ధి ఉన్న మూర్ఖులు మాత్రమే బడ్జెట్పై మాట్లాడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా ఇలాంటి సమస్యలపై నోరు విప్పడం లేదని అన్నారు. అయితే, ఉపేంద్ర వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పలువురు కర్ణాటక అధికార పార్టీ నేతలు పేర్కొన్నారు. అవగాహన లేకుండానే విమర్శలు చేస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.
మార్పును కోరుకునేవారు రండి
‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ అనేది రాజకీయ పార్టీనే. మార్పును కోరుకునే ఎవరైనా ఇందులో చేరవచ్చు. ప్రజాకీయ పార్టీ కోసం విలువైన సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తా' అని తన ట్విట్టర్ ఖాతాలో ఉపేంద్ర వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్కు ఆయన అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.
పార్టీ కోసం సినిమాలు
కాగా, ఉపేంద్ర ఒక వైపు రాజకీయ పార్టీ క్రియాశీలకంగా నడిపించేందుకు సిద్ధమవుతూనే.. మరో వైపు సినిమాలు కూడా చేసేస్తున్నారు. పార్టీ నడిపేందుకు డబ్బులు కావాలని.. డబ్బులు కావాలంటే తాను సినిమాలు తీయక తప్పదని ఉపేంద్ర ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.