హీరో ఉపేంద్రకు అప్పుడే కౌంటర్: రైతులను మోసం చేసి నీతులు చెబుతున్నావా ?
బెంగళూరు: కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి ప్రముఖ నటుడు, దర్శకుడు రియల్ స్టార్ ఉపేంద్ర సిద్దం అయిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన ప్రముఖ ఆర్ టీఐ కార్యకర్త (సామాజిక కార్యకర్త ఎస్,ఆర్. హీరేమఠ్ ఈ విషయంపై సోమవారం హుబ్బళిలో మీడియాతో మాట్లాడారు.
మొదట ఉపేంద్ర మారాలని, తరువాత ప్రజలను ఉద్దరించడానికి సిద్దం కావాలని ఎస్ఆర్. హీరేమఠ్ సూచించారు. రైతుల భూములు కొనుగోలు చేసిన ఉపేంద్ర తరువాత నియమాలు ఉల్లంఘించి వ్యవసాయ భూములను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకున్నారని ఎస్ఆర్. హీరేమఠ్ ఆరోపించారు.
వ్యవసాయ భూముల్లో వాణిజ్య కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తారని హీరేమఠ్ ప్రశ్నించారు. మొదట రైతుల దగ్గర తీసుకున్న వ్యవసాయ భూములు తిరిగి వారికే ఇచ్చేయాలని, అలా చేస్తే ఉపేంద్ర ప్రజల కష్టాలు గుర్తించి ప్రజాసేవ చేసే ఉత్తమ రాజకీయ నాయకుడు అని అందరూ నమ్ముతారని చెప్పారు.
రైతుల దగ్గర కొనుగోలు చేసిన వ్యవసాయ భూములను వెంటనే తిరిగి ఇవ్వడానికి రియల్ స్టార్ ఉపేంద్ర సిద్దం కావాలని హీరేమఠ్ సూచించారు. రైతుల దగ్గర ఉపేంద్ర తీసుకున్న వ్యవసాయ భూముల విషయంలో కోర్టు ఆయనకు అనుకూలంగానే ఇటీవల తీర్పు ఇచ్చింది.