లోకసభ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్కు మద్దతుపై హీరో ఉపేంద్ర ఏం చెప్పారంటే?
బెంగళూరు: రానున్న లోకసభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లోను పోటీ చేస్తుందని ప్రముఖ సినీ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ) అధ్యక్షులు ఉపేంద్ర తెలిపారు. కర్ణాటకలోని మొత్తం 28 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల బరిలో ఎవరిని నిలపాలనే దానిపై ఓ ప్రక్రియ ఉందని చెప్పారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం త్వరలో ప్రకటిస్తామన్నారు. రెండు మూడు వారాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న వారు ఇరవై మంది తనను కలిశారన్నారు.
కర్ణాటక సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన ప్రకాశ్ రాజ్కు మద్దతుపై ఉపేంద్ర స్పందించారు. తమ పార్టీలో అందరికీ ఒకే రకమైన నియమాలు ఉంటాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కని మేనిఫెస్టోతో వస్తే ప్రకాశ్ రాజ్కు మద్దతిచ్చే విషయాన్ని ఆలోచిస్తామన్నారు. తమ పార్టీ రాజకీయాలు చేయదని, ప్రజలు కోరుకున్నది చేస్తుందన్నారు.
అభ్యర్థులు ఎవరైనా అసంబద్ధ హామీలతో వస్తే పార్టీ అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పారు. పోటీ చేయాలనుకున్నవారు ఎవరైనా పక్కా ప్రణాళికతో ముందుకు రావాలని చెప్పారు. అభ్యర్థుల విషయంలో ఎంపిక, ఎన్నిక, దిద్దుబాటు, తిరస్కరణ, ప్రోత్సాహం లాంటి అంశాల్లో తమ పార్టీలో ప్రజలే కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు.
గతంలో కర్ణాటక ప్రజావంత జనతా పార్టీ (కేపీజేపీ)ని ఉపేంద్ర స్థాపించారు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ పార్టీలో ఉన్న విభేదాల వల్లే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. అందుకే తాను స్వయంగా స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. ఉపేంద్ర 2018లో యూపీపీ పార్టీని స్థాపించారు.